కొత్త బిచ్చగాడు పొద్దెరుగడన్నట్లు కాంగ్రెస్ వ్యవహరిస్తుంది !

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని యాకత్ పురా అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలో ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ పాల్గొని మాట్లాడుతూ ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బీజేపీ విజయ సంకల్ప యాత్రకు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. కొత్త బిచ్చగాడు పొద్దెరుగడన్నట్లు కాంగ్రెస్ వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకే గ్యారెంటీ లేదు. ఇంకా 6 గ్యారెంటీలు ఎలా నెరవేరుస్తారని ప్రశ్నించారు. మొన్న కర్ణాటకలో, ఇప్పుడు తెలంగాణలో నెరవేర్చలేని గ్యారెంటీలు కాంగ్రెస్ ఇచ్చిందని మండిపడ్డారు. తెలంగాణలో అధికారంలోకి రాకముందు పథకాలు అందరికీ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్, ఇప్పుడు కొందరికే అంటూ షరతులు పెట్టిందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసం కాంగ్రెస్ పథకాల నాటకం ఆడుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దేశ వ్యాప్తంగా కుంభకోణాలు, దోపిడీలు, దొంగతనాలు జరిగాయని అన్నారు. కాంగ్రెస్ పై విసిగి వేసారిన దేశ ప్రజలు 2014లో నరేంద్ర మోడీకి పట్టం కట్టారని, అప్పటి నుండి ఇప్పటి వరకు దేశం అభివృద్ధి చెందుతూ ఎక్కడా కూడా అవినీతి లేకుండా పాలన కొనసాగిందని లక్ష్మణ్ తెలిపారు. మళ్ళీ ఇప్పుడు అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తుంది. కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ప్రజల కోసం పోరాడే గొప్ప వ్యక్తి ప్రధాని మోడీ అని పొగడ్తల వర్షం కురిపించారు. ప్రపంచ నెంబర్ వన్ ప్రధాని ఎవరని సర్వే చేస్తే మోడీ పేరే వచ్చిందని లక్ష్మణ్ తెలిపారు. ఇది మన దేశానికే గర్వకారణం మోడీని మరోసారి ప్రధాని చేస్తే భారత్ దేశం విశ్వగురుగా ఎదుగుతుందని తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్దం కూడా ఆపగలిగిన శక్తి ప్రధాని మోడీది అని అన్నారు. రాముడే లేడు, రామసేతుని నమ్మలేము అని మాట్లాడిన కాంగ్రెస్.. ఇప్పుడు ఎన్నికల కోసం దేవుడి పేరుతో రాజకీయం చేస్తుందని దుయ్యబట్టారు. ముగిసిన శకం బీఆర్ఎస్ ది.. మునిగిపోయే పడవ కాంగ్రెస్ పార్టీ, వికసించే కమలం బీజేపీ పార్టీ అని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)