ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య ఆలయంలో రాముడి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ సమయంలో మంత్రులకు ప్రధాని మోడీ పలు కీలక సూచనలు చేశారని తెలుస్తోంది. గత కేబినెట్ సమావేశంలో ఈ ప్రస్తావన వచ్చిందని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. మంత్రులంతా విధేయతా, భక్తిభావంతో మసలుకోవాలని, దుందుడుకు ప్రవర్తనకు దూరంగా సంయమనంతో వ్యవహరించాలని మోడీ పేర్కొన్నారు. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం వేళ ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరించారు. పార్టీ గౌరవం ఇనుమడింపజేసేలా నడుచుకోవాలన్నారు. తమ నియోజకవర్గాల్లో సామరస్యపూరిత వాతావరణానికి ఎలాంటి విఘాతం కలగకుండా చూసుకోవాలని కోరారు. రామాలయ ప్రారంభోత్సవం తర్వాత తమ నియోజకవర్గాలకు చెందిన ప్రజలు అయోధ్యను సందర్శించేలా ఏర్పాట్లు చేయాలని మంత్రులకు సూచించారు. ఈనెల 22న అయోధ్య భవ్య రామమందిరంలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు, వేలాది మంది సాధువులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి భారీ స్థాయిలో భక్తులు తరలిరానున్నారు. అందుకోసం అధికారులు తగిన ఏర్పాటు చేస్తున్నారు.
ప్రతిష్ఠాత్మక కార్యక్రమం వేళ మంత్రులకు మోడీ సూచనలు !
January 09, 2024
0
Tags