హర్యానా మాజీ సీఎం భజన్లాల్ మనువడు, ప్రస్తుత ఎమ్మెల్యే భవ్య బిష్ణోయ్ ఒక ఐఏఎస్ అధికారిణిని వివాహం చేసుకోబోతున్నారు. ఈ నెల 22న ఘనంగా జరగనుంది. ఒక ఎమ్మెల్యే, ఐఏఎస్ అధికారిణి మ్యారేజ్ అంటే.. ఎలాగూ అంగరంగ వైభవంగానే జరుగుతుంది కదా.. అందులో వింత ఏముందని అనుకుంటున్నారా? కానీ నిజంగానే అంతకుమించి ఉంది. వీరి పెండ్లి రిసెప్షన్కు రెండు రాష్ట్రాల నుంచి దాదాపు 3 లక్షల మంది హాజరు కాబోతున్నారు. వీరంతా వీఐపీలు, వీవీఐపీలు అనుకుంటున్నారేమో! కానీ కాదు.. వీళ్లలో సగానికి పైగా అతిథులు సాదాసీదా ప్రజలే! భవ్య బిష్ణోయ్ కుటుంబం తరతరాలుగా రాజకీయాల్లోనే ఉన్నారు. ఆయన తాత హరియాణాకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. తండ్రి కుల్దీప్ బిష్ణోయ్ బీజేపీ నేత, మాజీ ఎంపీ. తండ్రీతాతల బాటలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన భవ్య బిష్ణోయ్.. అదంపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈయనకు రాజస్థాన్కు చెందిన ఐఏఎస్ అధికారిణి పరి బిష్ణోయ్తో వివాహం నిశ్చయమైంది. గత ఏడాది వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ జరగ్గా.. ఈ నెల 22న రాజస్థాన్లోని ఉదయ్పూర్లో పెండ్లి జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక పుష్కర్, అదంపూర్, ఢిల్లీ మూడు నగరాల్లో రిసెప్షన్లు ఏర్పాటు చేశారు. రాజస్థాన్లోని అతిథుల కోసం డిసెంబర్ 24న పుష్కర్లో మొదటి రిసెప్షన్ వేడుక జరగనుంది. దీనికి 30 నుంచి 50 వేల మంది వరకు అతిథులు హాజరుకానున్నారు. డిసెంబర్ 27న ఢిల్లీలో మరో రిసెప్షన్ జరగనుంది. ఈ ఈవెంట్ కోసం పలువురు కేంద్ర నాయకులతో పాటు 2500 నుంచి 3 వేల మందిని ఆహ్వానించారు. ఢిల్లీ కంటే ముందు అదంపూర్లో మరో రిసెప్షన్ జరగనుంది. బిష్ణోయ్ కుటుంబాన్ని తరతరాలుగా ఆదరిస్తున్న నియోజకవర్గ ప్రజల సమక్షంలో ఈ వేడుక నిర్వహించబోతున్నారు. డిసెంబర్ 26 న జరగబోయే ఈ వేడుకకు నియోజకవర్గంలోని 80 గ్రామాలకు చెందిన లక్ష మందికి పైగా అతిథులు రానున్నారు. వీరికోసం ఇప్పటికే ఆహ్వానాలు కూడా పంపించినట్లు భవ్య బిష్ణోయ్ తండ్రి కుల్దీప్ బిష్ణోయ్ మీడియాకు తెలిపారు.
ఐఏఎస్తో ఎమ్మెల్యే పెండ్లి - 3 లక్షల మందికి ఆహ్వానం !
December 09, 2023
0
Tags