సీబీఐ విచారణకు హాజరైన విశాల్ !

Telugu Lo Computer
0

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అవినీతికి పాల్పడిందని ఆరోపణలు చేసిన కేసు విషయంలో సీబీఐ విచారణకు సినీ నటుడు విశాల్ హాజరయ్యారు. ఇదే విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదిక ద్వారా వెల్లడించారు. సీబీఎఫ్సీపై తాను చేసిన ఆరోపణలపై మంగళవారం తాను ముంబైలోని సీబీఐ కార్యాలయానికి హాజరు అయ్యానని విశాల్ చెప్పారు. సీబీఐ విచారణ తనకు కొత్త అనుభవం నేర్పిందని, దర్యాప్తు జరుగుతున్న తీరు కూడా తనకు సంతోషంగా ఉందని చెప్పారు. తాను కూడా సీబీఐ కార్యాలయానికి వెళ్తానని తన జీవితంలో ఎప్పుడూ అనుకోలేదని ఎక్స్ (ట్విట్టర్) ద్వారా చెప్పారు విశాల్. రీల్ లైఫ్‌లోనే కాకుండా నిజ జీవితంలో కూడా అవినీతికి వ్యతిరేకంగా నిలబడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రెండు నెలల క్రితం తమిళ హీరో విశాల్ ముంబై సెన్సార్ బోర్డుపై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఆయన హీరోగా వచ్చిన మార్క్ ఆంటోనీ హిందీ సెన్సార్ కోసం రూ.6.5 లక్షల లంచం అడిగారని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ముంబై సెన్సార్‌ బోర్డుపై కేసు నమోదు చేసింది. విశాల్ ఫిర్యాదు ఆధారంగా సీబీఐ అధికారులు అక్టోబర్ మొదటి వారంలో కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా ముగ్గురు మధ్యవర్తులతో పాటు ముంబై సీబీఎఫ్‌సీకి చెందిన మరికొందరిపైనా విచారణ చేపట్టారు. అంతటితో ఆ వివాదం సద్దుమణిగింది అనుకున్నారంతా కానీ.. ఇప్పుడు తాజాగా విశాల్ తనకు సీబీఐ నుండి పిలుపు వచ్చిందని విచారణకు వెళ్లే ముందే చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)