కాంగ్రెస్ అంటే కట్, కమీషన్, కరప్షన్ !

Telugu Lo Computer
0


ర్యానా ప్రభుత్వం గురువారం నిర్వహించిన అంత్యోదయ సమ్మేళన్ లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రసంగిస్తూ కాంగ్రెస్ అవినీతి పార్టీ అని, 27 పార్టీలు తమ స్వప్రయోజనాల కోసమే కాంగ్రెస్ తో జతకట్టాయని అన్నారు. ఈ సందర్భంగా ఇండియా కూటమిపై ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. ఇండియా కూటమి నేతలు ఒకరినొకరు తిట్టుకునే పనిలో ఉన్నారని వారు అధికారంలోకి వచ్చినా అదే పరిస్థితి ఉంటుందని ఆరోపించారు. హర్యానా సీఎం మనోహార్ లాల్ ఖట్టర్ రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. బీజేపీ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తోందని, ప్రతిపక్షాలు తమపై బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. హర్యానాలో బీజేపీ సర్కార్ తొమ్మిదేళ్లలో శాంతిభద్రతలను మెరుగుపరిచిందని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలను చూసి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో షా, మనోహర్ లాల్ ఖట్టర్ సమక్షంలో 'అంత్యోదయ' కుటుంబాల కోసం ఐదు పథకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా హర్యానా కాంగ్రెస్ లెజిస్టేటివ్ పార్టీ లీడర్ భూపీందర్ హుడాపై షా మండి పడ్డారు. బీజేపీ హయాంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి మీకు కనిపించట్లేదా, కళ్లు మూసుకున్నారా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో కాంగ్రెస్ హర్యానాతో పాటు, దేశాభివృద్ధిని పక్కకు పెట్టేసిందని ఆరోపించారు. "కాంగ్రెస్ కట్, కమీషన్, అవినీతి పార్టీ. ఆ పార్టీ హస్తం ప్రజల వద్ద లేదు" అని ఎద్దేవా చేశారు. ఇండియా కూటమి అహంకారపూరిత కూటమి అని, అందులోని సభ్యులు రాజవంశాలకు చెందిన వారని విమర్శించారు. అందరూ తమ కుటుంబ సభ్యులకు అధికారం ఇవ్వాలని పాకులాడుతున్నాయని,  ఒకరు కుమారుడ్ని సీఎం చేయాలని చూస్తే, మరి కొందరు తమ కుటుంబంలోని మరో వ్యక్తిని, ఇంకొందరు తామే ఉన్నత హోదాలో కూర్చోవాలని చూస్తున్నారని ఆరోపించారు. వీరంతా ప్రజలకు మంచి చేయడానికి రావట్లేదని, తమ కుటుంబాలను రక్షించుకోవడానికి, అధికారం చేజిక్కించుకోవడానికి వస్తున్నారని అన్నారు. అయోధ్య రామ మందిరం విషయంలోనూ కాంగ్రెస్ నాన్చివేత ధోరణి అవలంబించిందని, ఆలయ నిర్మాణాన్ని అడ్డుకుందని షా ఆరోపించారు. జనవరి 22న అయోధ్య రామమందిరంలో రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించనున్నట్లు వెల్లడించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)