ఉత్తరప్రదేశ్లో 1995లో అంకుర్ గుప్తా పోస్టల్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేశాడు. ప్రీ ఇండక్షన్ ట్రైనింగ్కు ఎంపికైన తర్వాత వృత్తి విద్య ద్వారా ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. అయితే ఈ కారణంతో మెరిట్ జాబితా నుంచి అతడ్ని మినహాయించారు. దీంతో ఇతర అభ్యర్థులతో కలిసి అంకుర్ గుప్తా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించాడు. 1999లో అనుకూలంగా తీర్పువచ్చింది. కాగా, ట్రిబ్యునల్ ఆదేశాలను పోస్టల్ డిపార్ట్మెంట్ సవాల్ చేసింది. 2000లో అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. అయితే క్యాట్ ఉత్తర్వును సమర్థించిన హైకోర్టు 2017లో ఆ పిటిషన్ను కొట్టివేసింది. అలాగే పోస్టల్ శాఖ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ కూడా 2021లో డిస్మిస్ చేసింది. ఈ నేపథ్యంలో పోస్టల్ శాఖ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు త్రివేది, దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ జరిపింది. టెస్ట్, ఇంటర్వ్యూ వంటి వాటి ద్వారా ఎంపిన చేసిన అంకుర్ గుస్తాను ప్రీ ఇండక్షన్ ట్రైనింగ్కు పంపిన తర్వాత మెరిట్ జాబితాలో చేర్చకపోవడాన్ని తప్పుపట్టింది. ఆ అభ్యర్థి వివక్షకు గురైనట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో నెలలోపు పోస్టల్ అసిస్టెంట్ పోస్ట్లో నియమించాలని ఆదేశించింది. ఆ పోస్ట్ ఖాళీగా లేకపోతే, సూపర్న్యూమరీ పోస్ట్ను సృష్టించాలని తీర్పు ఇచ్చింది. అయితే ప్రొబెషనరీ కాలంలో అతడి పనితీరు సంతృప్తిగా ఉంటే సర్వీస్ను ధృవీకరించాలని లేని పక్షంలో చట్టానికి అనుగుణంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు సూచించింది. అలాగే ఆ అభ్యర్థి ఇంత కాలం పని చేయనందుకు జీతం లేదా ఎలాంటి బకాయిలు లేదా సీనియార్టీని పొందలేడని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు తీర్పుతో పోస్టల్ ఉద్యోగం పొందిన వ్యక్తి !
October 25, 2023
0
Tags