అన్నం తినకుండా మారాం చేస్తున్నారనో.. అల్లరి ఆపడం కోసమో చాలా మంది తల్లిదండ్రులు పిల్లల చేతికి ఫోన్ ఇస్తుంటారు. తొలుత సరదాగా ప్రారంభమైనప్పటికీ క్రమేపీ వారికి అదో వ్యసనంగా మారుతోంది. దీంతో.. రోజులో ఫోన్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారట. తాజాగా పిల్లల రోజువారీ ఫోన్ వినియోగంపై హ్యాపీనెట్జ్ అనే సంస్థ సర్వే చేపట్టింది. ఈ సర్వే నివేదిక ప్రకారం 42 శాతం మంది 12 ఏళ్ల లోపు వయస్సు పిల్లలు రోజులో రెండు నుంచి నాలుగు గంటలపాటు ఫోన్ స్క్రీన్లకు అతుక్కుపోతున్నారట. 12 ఏళ్ల కంటే పైబడిన పిల్లలు రోజులో 47 శాతం సమయం ఫోన్ చూస్తున్నారని నివేదికలో పేర్కొన్నారు. ఈ సర్వే ప్రకారం 69 శాతం పిల్లలకు సొంత ఫోన్లు, ట్యాబ్లు ఉన్నాయట. అలానే, 12 ఏళ్లు, అంతకంటే పెద్ద వయసు పిల్లలకు ఎలాంటి షరతులు లేకుండా ఇంటర్నెట్ యాక్సెస్ పొందుతున్నారని సర్వేలో వెల్లడైంది. 74 శాతం మంది పిల్లలు యూట్యూబ్ చూసేందుకు ఫోన్ వాడుతుంటే, 12 ఏళ్ల పైబడినవారు గేమింగ్ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నారట. ప్రస్తుతం విద్య నుంచి ఎంటర్టైన్మెంట్ వరకు ప్రతిదీ డిజిటల్ కావడంతో స్మార్ట్ఫోన్, ట్యాబ్ పిల్లలకు యాక్ససెరీగా మారిందని హ్యాపీనెట్జ్ సీఈవో రిచా సింగ్ తెలిపారు. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు క్రమశిక్షణ అలవాటు చేసినప్పటికీ.. ఫోన్ విషయంలో మాత్రం వారిని కంట్రోల్ చేయలేకపోతున్నామని సర్వేలో తెలిపారు.
పిల్లల్లో పెరుగుతున్న మొబైల్ వాడకం !
September 28, 2023
0
Tags