కేంద్ర ప్రభుత్వం హఠాత్తుగా బియ్యం ఎగుమతులపై నిషేధాన్ని విధించడంతో దేశంలోని పలు ఓడరేవుల్లో బియ్యం కంటైనర్లు పేరుకుపోయాయి. జూలై 20 సాయంత్రం నాన్-బాస్మతి బియ్యం ఎగుమతులపై నియంత్రణలు ప్రకటిస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) నోటిఫికేషన్ జారీచేసింది. ఎగుమతులు నిలిచిపోవడంతో ఇప్పటికీ రేవుల వద్ద 2,00,000 టన్నుల బియ్యం నిల్వలు పడిఉన్నాయి. నోటిఫికేషన్ ఇచ్చేనాటికి షిప్ల్లో లోడింగ్ మొదలైన బియ్యం ఎగుమతులనే అనుమతించారు. నోటీఫై అయినతర్వాత పలు రేవుల వద్ద ఉన్న బియ్యం నిల్వలకు కస్టమ్స్ క్లియరెన్స్ లభించలేదు. దీంతో వీటి ఎగుమతులు నిలిచిపోయాయని వ్యాపారులు చెప్పారు. ఇలా నిలిచిపోయిన కార్గోలు 1,50,000 నుంచి 2,00,00 టన్నుల వరకూ ఉంటాయని తెలిపారు. అత్యవసరమైన దేశాలకు ఎగుమతి చేసేందుకు ప్రత్యేక అనుమతులు ఇచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో నిల్వల్ని రేవుల వద్దే వ్యాపారులు అట్టిపెట్టినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రపంచంలో భారత్ నుంచే బియ్యం అధికంగా ఎగుమతులు జరుగుతుంటాయి. బియ్యం అంతర్జాతీయ వాణిజ్యంలో భారత్ వాటా 45 శాతం. నెలకు భారత్ నుంచి 18 లక్షల టన్నుల వరకూ బియ్యం ఎగుమతి అవుతాయి. అందులో నాన్-బాస్మతి బియ్యం 10 లక్షల నుంచి 12 లక్షల టన్నుల వరకూ ఉంటుంది.
ఎగుమతులపై నిషేధంతో ఓడ రేవుల్లో పేరుకుపోయిన బియ్యం
August 04, 2023
0
Tags