"సముద్రతీరం నుంచి మంచు పర్వతాల వరకు నేను సాగించిన పాదయాత్రలో చాలా మంది పాదయాత్రపై ప్రశ్నించారు. మొదట వారికేం చెప్పాలో నాకు తెలియక పోయినా, యాత్ర మొదలైన కొన్నాళ్లలోనే విషయం నాకు అర్ధం కావడం మొదలైంది. దేనికోసం నేను మరణానికి కూడా సిద్ధమో, దేనికోసం జైలుకు వెళ్లడానికి సిద్ధమో… అది అర్ధం కావడం మొదలైంది. కొన్నేళ్ల నుంచి నేను నిత్యం దాదాపు 10 కిమీ పరిగెత్తేవాడిని. అలాంటిది రోజుకు పాతిక కిలోమీటర్లు నడవడం ఏముంది అనుకొన్నా. అప్పట్లో నాలో అహంకారం ఉంది. కానీ ఆ అహంకారాన్ని భారత్ ఒక్క క్షణంలో మాయం చేస్తుంది. రెండుమూడు రోజుల్లోనే నాకు ఒళ్లు నొప్పులు మొదలయ్యాయి. నాలో అహంకారం మాయమైంది. ఈ యాత్రలో ప్రజలు నాకు అండగా నిలిచారు. జనసందోహాన్ని చూసి ఒక్కోసారి మాట్లాడలేకపోయా. ప్రతిరోజూ ఉదయం 6 నుంచి సాయంత్రం 8 గంటల వరకు వివిధ వర్గాలు చెప్పింది విన్నాను"
" నా వద్దకు ఓ రైతు వచ్చాడు. అతడికి పంటల బీమా దక్కిందా అని అడిగాను. లభించలేదని చెప్పాడు. ఆ క్షణంలో రైతు మనసు లోని బాధను నేను అనుభవించాను, అతడి ఆకలి బాధ నాకు తెలిసొచ్చింది. ఆ తర్వాత యాత్ర తీరు మారిపోయింది. నాటి నుంచి చుట్టు పక్కల ప్రజల నినాదాలు నాకు వినిపించేవి కావు. నాకు కష్టాలు చెప్పుకునే వారి ఆవేదన మాత్రమే వినిపించేది. ఈ దేశాన్ని భూమి, బంగారం, భాషల పేరుతో రకరకాలుగా పిలుస్తుంటారు. కానీ ఈ దేశం ఓ గొంతుక. దానిని వినాలంటే మన మనసులోని అహంకారాన్ని ద్వేషాన్ని త్యజించాలి. అప్పుడే హిందుస్థాన్ గొంతు వినిపిస్తుంది.
" ఇది అవిశ్వాస తీర్మానంలో ఎందుకు చెబుతున్నానంటే , కొన్ని రోజుల క్రితమే నేను మణిపూర్ వెళ్లాను. కానీ మన ప్రధాని అక్కడికి వెళ్లలేదు. ఆయన దృష్టిలో మణిపూర్ భారత్లో లేదు. మణిపూర్ ఇక ఏమాత్రం మిగిలిలేదు. ఆ రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా విడగొట్టారు. అక్కడి పునరావాస శిబిరాల్లో మహిళలు, పిల్లలతో మాట్లాడాను. మీకేం జరిగింది? అని ఓ మహిళను ప్రశ్నించా. దీనికి ఆమె స్పందిస్తూ " నా ఏకైక బిడ్డను కళ్లెదుటే కాల్చి చంపారు. ఆరోజు రాత్రి మొత్తం నా బిడ్డ శవం వద్దే పడి ఉన్నాను. ఆ తర్వాత నాకు భయం వేసింది. చివరికి నా సర్వస్వం వదిలి కట్టుబట్టలతో వెళ్లిపోయాను" అని చెప్పింది. ఒక ఫోటోమాత్రం చూపింది" " మరో క్యాంపులో ఓ సోదరిని ప్రశ్నించగా, ఆమెకు జరిగింది గుర్తుకు వచ్చి వణికి పోవడం మొదలు పెట్టింది. ఆ తర్వాత స్పృహ కోల్పోయింది. మీకు రెండు ఉదాహరణలు మాత్రమే చెప్పాను. స్పీకర్ సర్.. వీళ్లు (పాలకులు) మణిపూర్లో భారత్ను హత్య చేశారు. దేశం ప్రాణం తీశారు. నేను ప్రసంగం మొదట్లో చెప్పినట్టు భారత్ ఓ గొంతు. అది ప్రజల హృదయస్పందన. దానిని చంపేశారు. అంటే భారత మాతను మీరు మణిపూర్లో హత్య చేశారు. మీరు దేశద్రోహులు. దేశ ప్రేమికులు కాదు. అందుకే మీ ప్రధాని మణిపూర్ వెళ్లడం లేదు. " అని బీజేపీపై రాహుల్ తీవ్రంగా విరుచుకుపడ్డారు.
" నా తల్లి ఒకరు ఇక్కడ ఉన్నారు. మరో తల్లిని మణిపూర్లో చంపారు. భారత సైన్యం ఒక్క రోజులోనే మణిపూర్లో శాంతి తీసుకురాగలదు. కానీ అలా చేయడం లేదు. ప్రధాని దేశ హృదయ స్పందన వినడం లేదు. ఆయన ఇద్దరి మాటలు మాత్రమే వింటారు. అదానీ కోసం మోడీ ఏం చేశారో చూడండి. రావణాసురుడు మేఘనాథుడు, కుంభకర్ణుడి మాటే వింటాడు. అలానే మోడీ, అదానీ, అమిత్షా మాటలే వింటారు. లంకను రావణుడి అహంకారమే కాల్చింది. దేశంలో మీరు కిరోసిన్ చల్లుతున్నారు. మణిపూర్లో చల్లారు. ఇప్పుడు హర్యానాలో చల్లుతున్నారు " అని తన ప్రసంగాన్ని రాహుల్ ముగించారు. రాహుల్ వ్యాఖ్యలతో సభలో ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. ప్రసంగం మధ్య కేంద్ర మంత్రి కిరణ్ రిజులు జోక్యం చేసుకొని మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పాలకులు చేసిన దానికి రాహుల్ గాంధీ దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
No comments:
Post a Comment