లక్షద్వీప్ స్కూల్స్ లో కొత్త యూనిఫాం !

Telugu Lo Computer
0


కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్ స్కూల్స్ లో కొత్త యూనిఫాంను తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ప్రభుత్వం తీసుకురానున్న కొత్త యూనిఫామ్ అక్కడ నివసించే ముస్లింలకు వ్యతిరేకంగా ఉందని పేర్కొంటున్న కాంగ్రెస్‌ కొత్త యూనిఫామ్‌ తీసుకురావడంపై నిరసన వ్యక్తం చేసింది. ప్రభుత్వం అమలు చేసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించింది. తరగతులను బహిష్కరించి నిరసన కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ముస్లింలు అధికంగా ఉండే ద్వీపసమూహంలోని ద్వీపవాసుల అంతర్గత సంస్కృతి మరియు జీవనశైలిని ధ్వంసం చేసేలా నూతన యూనిఫాం నిబంధన ఉందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. బాలికలకు హిజాబ్‌లు లేదా స్కార్ఫ్‌లపై స్పష్టత ఇవ్వకుండా కొత్త డ్రెస్ కోడ్ ఆదేశాలు ఇచ్చారని లక్షద్వీప్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ హమ్దుల్లా సయీద్ ఆరోపించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరియు లక్షద్వీప్ పరిపాలన దీవుల సంస్కృతి మరియు ధర్మాలకు పూర్తి విరుద్ధమైన ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. కొత్త యూనిఫాం కోడ్‌ను ప్రవేశపెడుతూ విద్యా శాఖ ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను ఆమోదించేది లేదని సయీద్ స్పష్టం చేశారు. లక్షద్వీప్ ఎంపీ, ఎన్సీపీ నేత మహ్మద్ ఫైజల్ కూడా మద్యం ముసాయిదా పాలసీకి, పాఠశాలల్లో కొత్త యూనిఫాం ఉత్తర్వులకు వ్యతిరేకంగా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీవుల ప్రజలు, తల్లిదండ్రుల సంఘం, పాఠశాలల్లో హిజాబ్ నిషేధాన్ని విధించే పరిపాలన చర్యను ప్రతిఘటించాలని ఫజల్‌ ఫేస్‌బుక్ పోస్ట్‌లో కోరారు. కొత్త మద్యం పాలసీ మరియు యూనిఫాం కోడ్‌ను విధించడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అన్నారు. ద్వీపవాసులు యుగయుగాలుగా అనుసరిస్తున్న ఆచారాలు, మత విశ్వాసాలు, ఆహారపు అలవాట్లు, డ్రెస్సింగ్ విధానాలను నిర్మూలించే విధంగా ఉత్తర్వులు ఉన్నాయని మండిపడ్డారు. “నిర్దేశించిన యూనిఫాం నమూనాలు కాకుండా ఇతర దుస్తులను ధరించడం పాఠశాల పిల్లలలో ఏకరూపత భావనను ప్రభావితం చేస్తుందని.. పాఠశాలల్లో క్రమశిక్షణ మరియు ఏకరీతి దుస్తుల కోడ్‌ను నిర్వహించడం ప్రధానోపాధ్యాయులు మరియు పాఠశాలల అధిపతుల బాధ్యత” అని విద్య శాఖ జారీ చేసిన సర్క్యులర్‌లో పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)