తెలంగాణలోని నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న బీఆర్ఎస్ శాసన సభ్యురాలు అజ్మీరా రేఖా నాయక్ పార్టీకి గుడ్బై చెప్పే యోచనలో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ.. ఆమెకు టికెట్ దక్కలేదు. దీనితో పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం. ఈ క్రమంలో రేఖా నాయక్ భర్త అజ్మీరా శ్యామ్ నాయక్ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్ రావ్ థాకరేను కలుసుకున్నారు. ఆయన చేతుల మీదుగా కాంగ్రెస్ కండువాను కప్పుకొన్నారు. దీనితో ఇక రేఖా నాయక్ కూడా కాంగ్రెస్లో చేరనున్నారు. ఖానాపూర్ ఎస్టీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడి నుంచి రేఖా నాయక్ వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. 2014, 2018లో భారీ మెజారిటీతో తన ప్రత్యర్థి రమేష్ రాథోడ్ను మట్టికరిపించారు. 2014లో టీడీపీ తరఫున, 2018లో కాంగ్రెస్ తరఫున రమేష్ రాథోడ్ పోటీ చేసి, రేఖా నాయక్ చేతిలో ఓటమి చవి చూశారు. కేసీఆర్ తాజాగా విడుదల చేసిన జాబితాలో రేఖా నాయక్ పేరు గల్లంతయింది. ఆమెకు బదులుగా ఖానాపూర్ టికెట్ను భుక్యా జాన్సన్ రాథోడ్ నాయక్కు ఇచ్చారు. పార్టీ క్యాడర్ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురుకావడం, నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులు రేఖానాయక్పై తీవ్ర అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో కేసీఆర్.. ఆమెను తప్పించారని చెబుతున్నారు.
కాంగ్రెస్లో రేఖా నాయక్ ?
August 22, 2023
0
Tags