మధ్యప్రదేశ్లోని దేవాస్ జిల్లా ఇక్లెరా గ్రామ సమీపంలోని అడవిలో చిరుతపులి సంచరిస్తూ గ్రామస్థులకు కనిపించింది. దీంతో గ్రామస్థులు చిరుతపులితో ఆడుకున్నారు. అస్వస్థతతో నీరసంగా ఉన్న చిరుతపులి వీపుపై ఓ యువకుడు కూర్చున్నాడు. మరికొందరు గ్రామస్థులు చిరుతతో సెల్ఫీ తీసుకున్నారు. తమ గ్రామంలోకి వచ్చిన చిరుతపులిని చూసి మొదట భయపడ్డా, ఆ తర్వాత నీరసంగా ఉండటం చూసి గ్రామస్థులు దాని చుట్టూ చేరి ఆడుకున్నారు. కొందరు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో ఉజ్జయిని నుంచి రెస్క్యూ టీం ఇక్లెరాకు చేరుకుని చిరుతను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లింది. ఈ వింత ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రెండేళ్ల చిరుతపులిని చికిత్స నిమిత్తం భోపాల్లోని వాన్ విహార్కు తీసుకెళ్లినట్లు అటవీ అధికారి సంతోష్ శుక్లా తెలిపారు. పశువైద్యుడు జంతువుకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించినట్లు ఆయన తెలిపారు. చిరుతపులి పరిస్థితి విషమంగా ఉందని, దానికి ఇండోర్లోని మోవ్ నుంచి వెటర్నరీ డాక్టర్ను పిలిపించి చికిత్స అందిస్తున్నారు. చిరుత మైకంలో అడవిలో సంచరిస్తోందని, సరిగ్గా నడవలేని స్థితిలో ఉందని ఫారెస్ట్ గార్డు జితేంద్ర చౌహాన్ తెలిపారు. చిరుతపులికి వాన్విహార్లో చికిత్స అందిస్తున్నామని, పూర్తిగా కోలుకునే అవకాశం ఉందన్నారు.
చిరుతపులితో ఆడుకున్న గ్రామస్తులు !
August 30, 2023
0
Tags