పెళ్లింట తీవ్ర విషాదం !

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాలోని అర్సర గ్రామంలో ఇంటి పెద్ద కొడుకు ఐదుగురు కుటుంబ సభ్యులు, బంధువులను దారుణంగా హత్య చేశాడు. అంతేకాదు నిందితుడు కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మెయిన్‌పురిలోని కిష్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని అర్సర గోకుల్‌పూర్ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి మధ్య ఈ దారుణమైన హత్యాకాండ జరిగింది. సుభాష్ యాదవ్ (65) చిన్న కుమారుడు సోను యాదవ్ (23) వివాహం గురువారం జరిగింది. వరుడితో కలిసి కుటుంబసభ్యులంతా ఇటావా జిల్లాలోని గంగాపూర్‌కు వెళ్లి వధువును ఇంటికి తీసుకొచ్చారు. పెళ్లి కావడంతో అప్పటి వరకు ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది. కొంతమంది బంధువులు తమ తమ ఇళ్లకు వెళ్లిపోగా మరికొందరు అక్కడే ఉన్నారు. శుక్రవారం రాత్రి నవ్వులు, కాస్త డ్యాన్స్‌లతో భోజనం సాగింది. ఆ తర్వాత కొందరు గదిలోకి, మరికొందరు డాబాపైకి వెళ్లి పడుకున్నారు. సుభాష్ యాదవ్ పెద్ద కుమారుడు సోహ్వీర్ యాదవ్‌కు అర్ధరాత్రి ఏమైందో తెలియదు. అతను లేచి డాబాపైకి వెళ్లి కొత్తగా పెళ్లయిన సోదరుడిని, అతని భార్యను పదునైన ఆయుధంతో పొడిచి హత్య చేశాడు. అయితే అక్కడితో ఆగకుండా నిద్రిస్తున్న మరో తమ్ముడు, బావ మరిదిని చంపేశాడు. కుటుంబంలోని సన్నిహితుడైన దీపక్ అనే యువకుడిని కూడా పదునైన ఆయుధంతో పొడిచి హత్య చేశాడు. అంతే కాదు నిందితుడు తన భార్యను, అత్తను కూడా వదిలిపెట్టలేదు. వారిద్దరిపై కూడా దాడి చేశాడు. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. దీనితో ఇంట్లో కలకలం రేగడంతో నిందితుడిని పట్టుకునేందుకు అందరూ అతని వెంట పరుగులు తీశారు. అయితే వారి నుంచి తప్పించుకునే క్రమంలో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో, బయట నిద్రిస్తున్న మరికొందరు కూడా కేకలు వేయడంతో నిద్ర లేచారు. కొద్దిసేపటి క్రితం ఆనందకరమైన, సంతోషకరమైన వాతావరణం ఉన్నచోట, రక్తం వరదలా పారింది. ఈ దాడిలో కొత్తగా పెళ్లయిన జంట సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దాడిలో తీవ్రంగా గాయపడిన నిందితుడి భార్య, అత్త కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చుట్టుపక్కల వారి సహాయంతో మహిళలిద్దరినీ మెయిన్‌పురి జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే ఇటావా జిల్లాలోని సైఫాయ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ఇంటితోపాటు పరిసర ప్రాంతాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంట్లోని సీనియర్ సభ్యుడు సుభాష్ యాదవ్‌ను విచారించడం ద్వారా సంఘటన వెనుక గల కారణాలను తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. పిల్లల మృతితో సుభాష్ యాదవ్ మనోవేదనకు గురయ్యాడు. తన పెద్ద కుమారుడు, నిందితుడు సోహ్వీ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి వెలుపల ఫోటోకాపీయర్‌గా పనిచేసేవాడని తెలిపారు. గత కొన్ని రోజులుగా దుకాణంలో నష్టాలు రావడంతో బంధువుల నుంచి కొంత డబ్బు కూడా డిమాండ్ చేస్తున్నాడు. దీనిపై ఇంట్లో వాగ్వాదం జరిగింది. అయితే ఇంట్లో పెళ్లి వాతావరణం నెలకొనడంతో కాసేపటికి అంతా సద్దుమణిగింది. సంతోషకరమైన వాతావరణం నెలకొంది. రెండు రోజుల క్రితం కొత్త కోడలు ఇంట్లోకి రావడంతో ఇంత పెద్ద మారణహోమం జరిగింది. పోలీసులు విచారణలో నిద్రిస్తున్న వ్యక్తులను దారుణంగా హత్య చేసినట్లు గుర్తించారు. పెళ్లితో అలసిపోయిన కుటుంబీకులు గాఢనిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. దాడి చేసిన వ్యక్తిని ఎవరూ అడ్డుకోలేకపోయారు. నిందితుడు తన ఇద్దరు సోదరులు, కొత్తగా పెళ్లయిన సోదరుడి భార్య, అతని బావ, స్నేహితుడితో సహా ఐదుగురిని హత్య చేశాడు. ఆ తర్వాత కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ హత్య వెనుక కారణాలు తెలియాల్సి ఉంది. దాడి చేసిన వ్యక్తి గాయపడిన భార్య, అత్త కోలుకున్న తర్వాత మాత్రమే కొంత సమాచారాన్ని పొందవచ్చు. అయితే ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారి వాంగ్మూలాలు ఇప్పట్లో నమోదు చేయలేం. ఈ విషయమై పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)