కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు కేబినెట్ ఆమోదం !

Telugu Lo Computer
0


జగన్‌ సీపీ పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో ఒకటైన కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ – సీపీఎస్ ను  ప్రభుత్వం రద్దు చేసింది. ఉద్యోగులు విభేదిస్తున్న సీపీఎస్ స్థానంలో కొత్తగా గ్యారెంటీడ్‌ పెన్షన్‌ స్కీమ్‌- జీపీఎస్ అమల్లోకి తెస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు బుధవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. ఈ నిర్ణయంతో పాటు ఉద్యోగులకు సంబంధించి మరో నాలుగు కీలక విషయాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 12వ పీఆర్సీ ఏర్పాటు, కొత్త జిల్లా కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు హెచ్ ఆర్సీ 12 శాతం నుంచి 16 శాతానికి పెంపు, 10,117 మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్దీకరణకు కేబినెట్‌ పచ్చజెండా ఊపింది. 2014 జూన్ 2 నాటికి ఐదేళ్లు పూర్తయిన కాంట్రెక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీపీఎస్ రద్దుపై ప్రభుత్వం గత కొంత కాలంగా కసరత్తు చేస్తోంది. ఉద్యోగులకు సంబంధించి ఐదు కీలక అంశాలకు ఆమోదం తెలపడమే కాదు మొత్తం 63 అంశాలకు ఈ కేబినెట్‌ సమావేశం ఆమోదం తెలిపింది. కొత్తగా జగనన్న ఆణిముత్యాలు పథకం అమలుకు మంత్రిమండలి పచ్చా జెండా ఊపింది. ఈ ఏడాది అమ్మఒడి, విద్యా కానుక పంపిణీకి కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇటీవల విశాఖలో జరిగిన గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమిట్‌లో ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలకు భూకేటాయింపులకు కూడా మంత్రి మండలి సమావేశం అనుమతి మంజూరు చేసింది. ఖాళీగా ఉన్న గ్రూప్‌ 1, 2 పోస్టుల భర్తీకి కూడా కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. వీటితో పాటు కొత్త మెడికల్‌ కాలేజీల్లో పోస్టుల భర్తీకి పోలీసు బెటాలియన్‌లో 3920 ఉద్యోగాల నియామకానికి మంత్రిమండలి అనుమతి మంజూరు చేసింది. సీపీఎస్ ను రద్దు చేస్తూ ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాన్ని ఉద్యోగ సంఘాలు స్వాగతించాయి. సీపీఎస్‌ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వ ప్రతిపాదనను స్వాగతిస్తున్నామన్నారు ఏపీగవర్నమెంటు ఎంప్లాయీస్‌ ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. ఉద్యుగులకు సంబంధించిన 5 అంశాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపిందని ప్రకటించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)