కస్టమ్స్ ఆఫీసర్లమని బురిడీ కొట్టించి 4 లక్షలు స్వాహా !

Telugu Lo Computer
0


సౌదీ అరేబియా నుంచి భారత్‌కు వచ్చిన 53 ఏళ్ల మహమ్మద్ సులేమాన్‌ను కస్టమ్స్ ఆఫీసర్లమని చెప్పి ఇద్దరు ఆగంతకులు అతను కష్టపడి సంపాదించిన సొమ్ము మొత్తాన్ని దోచుకుని నడిరోడ్డుపై వదిలేశారు. దిక్కుతోచని స్థితిలో సులేమాన్ ఢిల్లీ పోలీసులను ఆశ్రయించాడు. ఢిల్లీ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు చెందిన మొహమ్మద్ సులేమాన్ సౌదీ అరేబియాలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ సంపాదించుకునే సామాన్యుడు. చాలాకాలం తర్వాత భారత్ వచ్చిన సులేమాన్‌ను ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో అడుగుపెట్టగానే ఇద్దరు వ్యక్తులు బురిడీ కొట్టించారు. తమను తాము కస్టమ్స్ అధికారులుగా పరిచయం చేసుకున్న ఆ ఇద్దరూ అక్కడి నుండి అతడిని నేరుగా పార్కింగ్ ప్రాంతానికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలోనే సులేమాన్ నుండి పాస్ పోర్టు సహా అన్ని వస్తువులను ఆ దుండగులు లాక్కున్నారు. అక్కడి నుంచి కారులో మహిపాల్ పూర్ వైపుగా తీసుకెళ్లి మార్గమధ్యలో ఒక నిర్మానుష్య ప్రాంతంలో ఆపి, ఈ ఫోన్ ఎక్కడిది? ఈ కరెన్సీ నీకెలా వచ్చిందని ప్రశ్నించి సులేమాన్ ఫోన్ తోపాటు అతని వద్దనున్న 19000 సౌదీ రియాద్లు(4.15 లక్షలు), రూ.2000 నగదును దోచుకున్నారు.

అనంతరం నిందితులు బాధితుడిని బలవంతంగా కారు దింపేసి, తమ సీనియర్ అధికారితో తిరిగి వస్తామని చెబుతూనే వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అప్పటికి గాని జరిగిందేంటో అర్ధం కాని సులేమాన్ లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 420 (చీటింగ్) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)