ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ జూలై 3న సమావేశం కానుంది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో కొత్తగా నిర్మించిన కన్వెన్షన్ సెంటర్లో జూలై 3న కేబినెట్ సమావేశం జరగనుంది. మొత్తం మోదీ కేబినెట్లో ఉన్న కేంద్ర మంత్రులు, సహాయ, స్వతంత్ర మంత్రులంతా ఈ భేటీకి హాజరవుతారు. ఈ సమావేశంలో 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మత్రివర్గ పునర్వ్యవస్థీకరణ గురించి చర్చించే అవకాశం ఉంది. కాగా జూలై మూడో వారంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానుండగా.. కొన్ని రోజుల ముందు మంత్రి మండలి సమావేశం జరగనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక జూన్ 28న మోదీ నేతృత్వంలో బీజేపీ ఆగ్రనేతలు సమావేశమైన సంగతి తెలసిందే. కేంద్ర హోంమత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర నేతలతో ప్రధాని మోదీ బుధవారం అర్థరాత్రి వరకు చర్చలు జరిపారు.
ఈ భేటీలో ఈ ఏడాది చివర్లో జరగనున్న కీలకమైన అసెంబ్లీ ఎన్నికలతోపాటు (రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ,మిజోరం), వచ్చే ఏడాది జరగబోయే లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ సన్నద్ధత గురించి చర్చించినట్లు సమాచారం. అదే విధంగా ప్రభుత్వంలో, రాష్ట్ర స్థాయిలో పార్టీలో సంస్థాగత మార్పుల గురించి కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇక బుధవారం జరిగిన సమావేశంలోనే కేబినెట్లో మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇది జరిగిన మరుసటి రోజే కేబినెట్ భేటీ ప్రకటన వెలువడటం చర్చనీయాంశమైంది.