జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల నిరసన సందర్భంగా నిన్న పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చట్టాన్ని ఉల్లంఘించారని పేర్కొంటూ నిరసనకారుల్ని బలవంతంగా అదుపులోకి తీసుకుని 12 మందిపై కేసులు నమోదు చేశారు. ఇక నుంచి జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల నిరసనకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఒకవేళ అనుమతుల కోసం గనుక వాళ్లు దరఖాస్తు చేసుకుంటే జంతర్ మంతర్ కాకుండా వేరే ఎక్కడైనా అనుమతులు ఇస్తామంటూ న్యూఢిల్లీ డీసీపీ కార్యాలయం ట్విటర్ ద్వారా స్పష్టం చేసింది. ''వాళ్లు పోలీసుల అభ్యర్థనను పట్టించుకోకుండా పార్లమెంట్ మార్చ్ను చేపట్టి, చట్టాన్ని ఉల్లంఘించారని తెలిపారు. అందుకే జంతర్ మంతర్ వద్ద వాళ్లు చేపట్టిన నిరసన దీక్ష ముగిసింది !. రెజ్లర్లు గనుక భవిష్యత్తులో మళ్లీ నిరసనకు దరఖాస్తు చేస్తే జంతర్ మంతర్ కాకుండా అనువైన ప్రదేశంలో వారి నిరసనకు అనుమతిస్తాం అని డీసీపీ ట్విటర్ హ్యాండిల్ ద్వారా ప్రకటించింది. ఇదిలా ఉంటే ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియా భగ్గుమంది. వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియాతో సహా నిరసనలో పాల్గొన్న రెజ్లర్లందరినీ ఈ కేసులో ప్రస్తావించారు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా ఈ నిరసనలు కొనసాగాయి. మొత్తం 38 రోజుల పాటు జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల నిరసన కొనసాగింది. భూషణ్ శరణ్ సింగ్ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేదించారని, అతన్ని అరెస్ట్ చేయాలని, ఎంపీ పదవికి రాజీనామా చేయాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు జోక్యంతో ఇప్పటికే బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై రెండు ఎఫ్ఐఆర్లను ఢిల్లీ పోలీసులు నమోదు చేశారు. కానీ, రెజ్లర్లు మాత్రం బ్రిజ్ను అరెస్ట్ చేసే దాకా నిరసనలు ఆపమని చెబుతున్నారు.
రెజ్లర్లకు జంతర్ మంతర్ వద్ద ఇక నుంచి అనుమతి లేదు !
May 29, 2023
0
Tags