ప్రేమికుల బలవన్మరణం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని భీమవరం సమీపంలోని గొల్లవానితిప్పకు చెందిన ఆకుల శ్యామ్‌ (24), పోతుల జ్యోతి (22) బంధువులు. ప్రేమలో ఉన్నారు. శ్యామ్‌ బైబిల్‌ బోధనలో శిక్షణ తీసుకుంటున్నాడు. జ్యోతి గతనెల 26న కూకట్‌పల్లికి వచ్చి ఓ ప్రైవేటు వసతిగృహంలో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. ఈమెకు గతంలోనే వివాహమవగా భర్త వేధింపుల కారణంగా విడాకులు తీసుకుంది. శ్యామ్‌ స్నేహితుడు, భీమవరానికి చెందిన కృష్ణ ఏడోఫేజ్‌లోని ఎల్‌ఐజీ 8లో ఓ గదిలో ఉంటున్నాడు. ఈనెల 20న కృష్ణ పెళ్లి ఉండటంతో 9న ఊరు వెళ్లాడు. గదిలో ఉంటున్న అతని స్నేహితుడు కూడా ముందురోజే ఊరు వెళ్లిపోయాడు. ఈనెల 12న నగరానికి వచ్చిన శ్యామ్‌ గది తాళం చెవులు కావాలంటూ కృష్ణకి ఫోన్‌ చేయడంతో పలానా చోట ఉందని చెప్పాడు. దీంతో జ్యోతిని తీసుకుని శ్యామ్‌ ఆ గదికి వెళ్లాడు. ఇంతకు ముందు కూడా అనేకసార్లు వీరిద్దరూ ఆ గదికి వచ్చి వెళ్లినట్లుగా స్థానికులు తెలిపారు. శనివారం నుంచి స్నేహితులు, స్థానికంగా ఉంటున్న బంధువులు జ్యోతికి ఫోన్‌ చేస్తుంటే స్పందన లేకపోవడంతో ఆమె కోసం అంతటా గాలించారు. సోమవారం ఉదయం కృష్ణ గది నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి వెనక వైపు ఉన్న స్లైడ్‌ కిటికీలు తెరిచి చూసేసరికి గదిలో జ్యోతి అచేతనంగా కింద పడిపోయి ఉండగా శ్యామ్‌ ఉరివేసుకుని కనిపించాడు. వారి ఫోన్లలో నంబర్ల ఆధారంగా కృష్ణకు, జ్యోతి బంధువుకు పోలీసులు ఫోన్లు చేసి విషయం చెప్పారు. గదిలో మాత్రల స్ట్రిప్‌ దొరకడంతో జ్యోతి నిద్రమాత్రలు మింగిందేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె నోటి నుంచి నురగ కనిపించింది. ఇంట్లో పెద్దలు ఒప్పుకోక పోవడంతో బలవన్మరణానికి పాల్పడ్డారా లేదా ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగి ఉంటుందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్‌టీం ఆధారాలు సేకరించిన తర్వాత మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)