మణిపూర్ రాష్ట్రాన్ని చూసి కర్ణాటక ఓటర్లు జాగ్రత్తపడాలని మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం హితవు పలికారు. బిజెపినేతలు చెప్పుకుంటున్నట్టుగా డబుల్ ఇంజన్ సర్కార్ అమల్లో ఉంటే ఆ రాష్ట్రం ఎలా ఉంటుందో మణిపూర్నే ఉదాహరణగా చెప్పుకోవచ్చని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. గిరిజనులకు, గిరిజనేతరులకు మధ్య గత కొన్నిరోజులుగా జరుగుతున్న ఘర్షణల వల్ల దాదాపు 9 వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇప్పటికీ ఆ రాష్ట్రంలో ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ కేంద్ర ఆర్థికమంత్రి పి. చిదంబరం కర్ణాటక ఓటర్లనుద్దేశించి శనివారం ట్వీట్ చేశారు. 'మణిపూర్లో 'డబుల్ ఇంజన్ సర్కార్' పరిణామాలను చూడండి. రెండు ఇంజన్లు విఫలమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం అంతర్గత విబేధాలతో విచ్ఛిన్నమైంది. అన్ని సమస్యలకు కేంద్రమే ట్రిగ్గర్. అదే సమస్యలకు హ్యాపీ సొల్యూషన్ని ఇస్తుంది. కాంగ్రెస్ హయాంలో శాంతియుతంగా ఇరువర్గాలు కలిసి ఉండడానికి ప్రయత్నించింది. కానీ బిజెపి హయాంలో అలా జరగలేదు. ఇరువర్గాలను విడదీసేందుకు ప్రయత్నించింది. ఫలితంగా గిరిజనులకు, మైటీలకు మధ్య విభజన జరిగింది. మణిపూర్రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వం.. రెండూ యుద్ధంపథంలో ఉన్నాయి. డబుల్ ఇంజన్ ప్రభుత్వం అనే బూటకపు వాగ్దానాల పట్ల కర్ణాటక ఓటర్లు జాగ్రత్త వహించాలి.' అని చిందరంబరం తన ట్వీట్లో పేర్కొన్నారు. బిజెపి నేతలు పదేపదే వాడే పదం డబుల్ ఇంజన్ సర్కార్. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే ప్రభుత్వం అధికారంలో ఉండడం. దీన్నే బిజెపినేతలు చెబుతుంటారు.
మణిపూర్ను చూసి కర్ణాటక ఓటర్లు జాగ్రత్తపడాలి !
May 06, 2023
0
Tags