రేపు వాయుగుండంగా మారే అవకాశం !

Telugu Lo Computer
0


మోచా తుపాను ముప్పు ముంచుకొస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారనుంది. అదికాస్తా ఎల్లుండిలోగా వాయుగుండంగా మారి విజృంభించనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది అల్పపీడనంగా మారి రేపటికి వాయుగుండంగా బలపడనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్తర దిశగా మధ్య బంగాళాఖాతం వైపు కదులుతూ తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుపానుకు మోచా అని భారత వాతావరణశాఖ నామకరణం చేసింది. ఇది పశ్చిమ బెంగాల్, మయన్మార్‌ల వైపు పయనిస్తుందని అంచనా వేస్తున్నారు. తూర్పు తీర ప్రాంతాలపై తుపాను ప్రభావం చూపనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ఒడిశాకు తుపాన్ ముప్పు పొంచి ఉండటంతో ప్రభుత్వం తీరప్రాంత జిల్లాలను అలెర్ట్‌ చేసింది. మోచా తుపాను దిశ మార్చుకుంటే కోస్తాంధ్ర వైపు కూడా ప్రభావం ఉండొచ్చని వాతావరణ శాఖ చెప్తోంది. కోస్తా, రాయలసీమ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఇప్పటికే.. ఆంధ్రప్రదేశ్‌లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎన్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక శాఖ బృందాలను ఏపీ ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. మత్స్యకారులను సముద్రంలోకి వెళ్ళొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరం సహాయం, సమాచారం కోసం స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు అధికారులు. తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షంతో పాటు భారీ ఈదురు గాలులు వీచే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వర్షాల కంటే ఈదురు గాలుల ప్రభావం అధికంగా ఉంటుందని, గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ చెప్పింది.

Post a Comment

0Comments

Post a Comment (0)