శరవేగంగా కొనసాగుతున్న హైస్పీడ్ రైళ్లు టెస్ట్ ట్రాక్ పనులు !

Telugu Lo Computer
0

భోపాల్-ఢిల్లీ మధ్య తాజాగా లాంఛ్ అయిన వందే భారత్ ట్రైన్ గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న మొదటి రైలు కావడం విశేషం. రాబోయే రోజుల్లో ఇంతకన్నా వేగంతో రైళ్లు పరుగులు తీయబోతున్నాయి.  భారతీయ రైల్వే హైస్పీడ్ టెస్ట్ ట్రాక్‌ను నిర్మిస్తోంది. హైస్పీడ్ రైళ్లను పరీక్షించేందుకు ప్రత్యేకంగా ట్రాక్ రూపొందిస్తోంది. ఈ ట్రాక్‌పై వందే భారత్ రైళ్లను గంటకు 220 కిలోమీటర్ల వేగంతో భారతీయ రైల్వే  నడపనుంది. ఈ ట్రాక్‌పై గంటకు 220 కిలోమీటర్ల వేగంతో విజయవంతంగా రైళ్లు నడిపిన తర్వాత, ఇలాంటి ట్రాక్స్ దేశవ్యాప్తంగా పలు రూట్లల్లో నిర్మించనున్నారు. గత తొమ్మిదేళ్లలో ప్రధాని మోడీ అనేక రంగాలను ఎగుమతుల హబ్‌గా మార్చారని, భారతదేశం రైల్వేలకు పెద్ద ఎగుమతిదారుగా ఎదగాలంటే టెస్టింగ్ ట్రాక్‌ల అభివృద్ధి చాలా ముఖ్యమని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. టెస్ట్ ట్రాక్ అనేక సౌకర్యాలను కలిగి ఉంటుందని, ఇందులో రైలు, సిగ్నలింగ్ వ్యవస్థ వేర్వేరు పారామీటర్స్‌లో పరీక్షించబడతాయని, టెస్ట్ ట్రాక్ పనులు శరవేగంగా సాగుతున్నాయని, ఈ రోజు వందే భారత్ గురించి చాలా చర్చ జరుగుతోందని, రాబోయే కాలంలో భారతదేశం వందే భారత్ రైళ్ల ఎగుమతిదారుగా మారుతుందని, ఇందుకోసం టెస్ట్ ట్రాక్‌పై అన్ని పరీక్షలు జరగాలని అన్నారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ డివిజన్‌లో, జైపూర్‌కి దాదాపు 70 కి.మీ దూరంలో గుఢా-థాటనామిత్ర మధ్య 59 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తూ బీజీ డెడికేటెడ్ టెస్ట్ ట్రాక్  భారతీయ రైల్వే నిర్మిస్తోంది. ఇందులో మెయిన్ లైన్, హైస్పీడ్ లూప్, యాక్సెలరేటెడ్ టెస్టింగ్ లూప్, కర్వ్ టెస్టింగ్ లూప్ ఉంటాయి. ప్రస్తుతం భారతదేశంలో వేగవంతమైన రైళ్ల విషయానికి వస్తే వందే భారత్ ఎక్స్‌ప్రెస్, శతాబ్ధి రైళ్లు మాత్రమే ఉన్నాయి. వీటి వేగం గంటకు 160 కిలోమీటర్ల వరకు మాత్రమే ఉంటుంది. హైస్పీడ్ ట్రాక్స్ అందుబాటులోకి వస్తే గంటకు 200 నుంచి 220 కిలోమీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణిస్తాయి. అయితే హైస్పీడ్ ట్రాక్ ప్రయాణికులకు అందుబాటులోకి రావడానికి ఇంకొన్నేళ్లు ఎదురు చూడాల్సిందే !. 

Post a Comment

0Comments

Post a Comment (0)