తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయం

Telugu Lo Computer
0


ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని గర్వాల్ ప్రాంతంలోని  కేదార్‌నాథ్ ధామ్ ఆలయం తలుపులు మంగళవారం ఉదయం తెరుచుకున్నారు. ఉదయం 6.20 గంటలకు ఆర్మీబ్యాండ్ మేళాలతో ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు అక్కడికి చేరుకోవడంతో హర్‌ హర్ మహాదేవ్ కీర్తనలతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని 35 క్వింటాళ్ల పూలతో అలకరించారు. ఆలయ ప్రధాన అర్చకులు జగద్గురు రావల్ భీమ్ శంకర్‌లింగ్ శివాచార్య ఆలయం తలుపులు తెరిచారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఆలయం తలుపులు తెరిచిన అనంతరం కేదార్ ధామ్‌ను దర్శించుకున్నారు. ఈ ప్రాంతంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆలయానికి వెళ్లే వేలాది మంది యాత్రికులు ముందుకు వెళ్లడాన్ని అధికారులు నిలిపివేశారు. కేదార్ నాథ్ వెళ్లే మార్గంలో భారీ మంచు కురుస్తున్నందన, వాతావరణం అనుకూలించక పోవటంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం యాత్రికుల నుంచి రిజిస్ట్రేషన్ దరఖాస్తులను స్వీకరించడాన్ని కూడా నిలిపివేసింది. ఏప్రిల్ 30వ తేదీ వరకు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిలిపివేసింది. ఆ తరువాత వాతావరణ పరిస్థితులను బట్టి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.  చార్‌ధామ్ యాత్రకు వచ్చే యాత్రికులు ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా కేదార్‌నాథ్ ధామ్లో వర్షాలు, మంచు కురుస్తున్న కారణంగా యాత్రికులు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నాలుగు పుణ్యక్షేత్రాలు యమునోత్రి, గంగోత్రి, కేదార్ నాథ్, బద్రీనాథ్ క్షేత్రాలను అనుసంధానం చేసేదే చార్‌ధామ్ యాత్ర. ఈ చార్‌ధామ్ యాత్రలో భాగంగా ఇప్పటికే యమునోత్రి, గంగోత్రి ఆలయాలు ఇప్పటికే తెరుచుకున్నాయి. గంగోత్రి ఆలయంలో ప్రధాని మోదీ పేరున తొలి పూజ నిర్వహించారు. మంగళవారం ఉదయం 6.20 గంటలకే కేదార్‌నాథ్ ఆలయం తలుపులు తెరిచారు. ఈనెల 27న బద్రీనాథ్ ధామ్ ఆలయం తెరుచుకోనుంది. అత్యంత ఎత్తయిన హిమాలయాల్లో ఈ నాలుగు పుణ్యక్షేత్రాలు ఉంటాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)