మధ్యప్రదేశ్ లోని విదిశా జిల్లాలో 8 ఏళ్ల బాలుడు 60 అడుగుల బోరుబావిలో పడిపోయాడు. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో ఆడుకుంటూ పొరపాటున అందులో జారిపడ్డాడు. స్థానికులు సమాచారం అందించడంతో అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. మూడు రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాలు, ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందం తక్షణమే సహాయక చర్యలు చేపట్టాయి. బోరుబావిలో బాలుడి కదలికలు గమనించి అతడు సురక్షితంగానే ఉన్నట్లు నిర్ధరించుకున్నాయి. అనంతరం అతడ్ని బయటకు తీసుకొచ్చేందుకు బోరుబావికి సరిసమానంగా తవ్వాయి. అతడు 43-44 అడుగుల వద్ద చిక్కుకుని ఉన్నాడని, కొద్ది గంటల్లో బయటకు తీసుకువస్తామని సహాయక సిబ్బంది తెలిపారు. బాలుడి కదలికలు గుర్తించినప్పటికీ అతనితో మాట్లాడలేకపోయినట్లు అధికారులు తెలిపారు. చిన్నారికి ఆహారం కూడా అందించే పరిస్థితి లేదన్నారు. వీలైనంత త్వరగా అతడ్ని బయటకు తీసుకొచ్చాక ఆహారం అందించి, ఆస్పత్రికి తీసుకెళ్తామని చెప్పారు.
బోరుబావిలో పడిన చిన్నారి !
March 15, 2023
0
Tags