వీధి కుక్కల దాడికి మరో బాలుడు బలి !

Telugu Lo Computer
0


తెలంగాణలోని ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల పరిధిలోని పుటాని తండా గ్రామ పంచాయతీలో కుక్కల దాడికి బాలుడు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ లో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన విషాద సంఘటన మరువక ముందే రఘునాథపాలెంలో మరో ఘటన చోటుచేసుకోవడంతో చిన్నారుల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. రఘునాథపాలెంకు చెందిన బానోతు రవీందర్, సంధ్య దంపతులకు చిన్న కుమారుడైన బానోతు భరత్ (5) గ్రామంలో పిల్లలతో ఆడుతుండగా వీధిలో ఉన్న కుక్కలు దాడి చేశాయి. దాడి చేసిన అనంతరం స్థానికుల సమాచారంతో హుటాహుటిన ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితిని గమనించిన వైద్యులు వెంటనే హైదరాబాదులోని నిమ్స్ హాస్పిటల్ కి తరలించాలని సూచించారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆర్టీసీ బస్సు నందు వెళుతుండగా మార్గం మధ్యలోనే బాలుడు మరణించాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. వీధిలో తిరుగుతున్న కుక్కలను చూసి గ్రామ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి గ్రామంలో ఉన్న కుక్కలను నియంత్రించే విధంగా కృషి చేయాలని కోరుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)