ఛత్తీస్గఢ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అర్హులైన నిరుద్యోగ యువతకు నెలకు రూ.2,500 చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వనున్నట్టు ప్రకటించింది. రాష్ట్ర వార్షిక బడ్జెట్లో ఈ ప్రకటన చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.1,21,500 కోట్ల వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఆర్థిక శాఖను కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ సభకు బడ్జెట్ సమర్పించారు. అంగన్వాడీ వర్కర్లు, హోం గార్డులు, గ్రామ కొట్వార్లు, ఇతరులకు నెలవారీ గౌరవ వేతనాన్ని పెంచుతున్నట్టు ఆయన ప్రకటించారు. ''నిరుద్యోగ యువతకు అలవెన్స్ ఇచ్చే కొచ్చ స్కీమ్ను ప్రారంభిస్తున్నాం. ఈ స్కీమ్ కింద 18 నుంచి 35 ఏళ్ల లోపు వయసు కలిగి, వార్షిక ఆదాయం 2.50 లక్షల కంటే తక్కువ ఉన్న వారికి నెలవారీ రూ.2.500 చొప్పున అలవెన్స్ ఇస్తాం'' అని సీఎం ప్రకటించారు. రాష్ట్ర బడ్జెట్ ప్రధానంగా యువత, రైతులు, కార్మికులు, మహిళలు, నిరుద్యోగులపై దృష్టి సారించింది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఛత్తీస్గఢ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. కాగా, అర్బన్ ట్రాన్స్పోర్ట్పై కూడా ప్రభుత్వం బడ్జెట్లో దృష్టి సారించింది. రాయపూర్-దుర్గ్ మధ్య లైట్ మెట్రో ప్రాజెక్టును ప్రతిపాదించింది. ఇందుకోసం రూ.250 కోట్లను కేటాయించింది. అంగన్వాడీ వర్కర్లకు గౌరవ వేతనాన్ని రూ.6,5000 నుంచి రూ.10,000కు, సహాయకులకు రూ.3.250 నుంచి రూ.5,000కు పెంచింది. మినీ-అంగన్వాడీ వర్కర్ల గౌరవ వేతనం రూ.4,500 నుంచి రూ.7,500కు పెంచింది. విలేజ్ కొట్వార్లకు కూడా వారు సేవలందించే ప్రాంతాలకు అనుగుణంగా గౌరవ వేతనంను పెంచుతున్నట్టు ప్రకటించింది.
నిరుద్యోగ యవతకు నెలకు రూ.2,500 !
March 06, 2023
0
Tags