యువ క్రికెటర్ పృథ్వీ షాపై దాడి జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన స్నేహితుడితో కలిసి ఫిబ్రవరి 15న ఓ హోటల్కు వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగింది. ముంబయి ఓషివారా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పృథ్వీ షా తన స్నేహితుడు సురేంద్రతో కలిసి ముంబైలోని శాంతాక్రూజ్లోని ఓ ఫైవ్స్టార్ హోటల్కు వెళ్లాడు. కొందరు వ్యక్తులు సెల్ఫీ కోసం పృథ్వీ షా వద్దకు వచ్చారు. అయితే ఇద్దరితో మాత్రమే సెల్ఫీ దిగేందుకు షా ఆసక్తి చూపగా.. గ్రూప్లోని మిగతావారు కూడా వచ్చి సెల్ఫీ కావాలని ఒత్తిడి చేశారు. తాను స్నేహితులతో కలిసి భోజనానికి వచ్చానని, ఇప్పుడు అందరితో సెల్ఫీ ఇవ్వడం కుదరదని పృథ్వీ షా వారికి సమాధానం ఇచ్చాడు. అప్పటికీ వారు వినకపోవడంతో షా స్నేహితుడు హోటల్ మేనేజర్ను పిలిచి ఫిర్యాదు చేశారు. దీంతో హోటల్ సిబ్బంది వారిని బయటకు పంపింది. దీన్ని మనసులో పెట్టుకున్న వారు.. హోటల్ నుంచి పృథ్వీ షా, అతడి స్నేహితుడు బయటకు రాగానే వారి కారుపై బేస్బాల్ బ్యాట్లతో దాడికి పాల్పడ్డారు. బీఎండబ్ల్యూ కారు వెనుక, ముందర భాగంలోని కిటికీలు ధ్వంసమైనట్లు పోలీసులు తెలిపారు. సంఘటన సమయంలో కారులోనే పృథ్వీ షా ఉన్నాడని.. అయితే దీనిని వివాదం చేయకూడదనే ఉద్దేశంతో అతడిని వేరే కారులో సురక్షితంగా ఇంటికి పంపించినట్లు షా స్నేహితుడు సురేంద్ర తెలిపారు. అయితే ఓ మహిళ తన కారును వెంబడించి రూ. 50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసిందని, లేకపోతే తప్పుడు కేసులు పెడతామని బెదిరించారని వెల్లడించారు. షా నుంచి ఫిర్యాదు అందుకొన్న ముంబాయి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. సెల్ఫీలు అడిగిన వివరాలను హోటల్ సిబ్బంది నుంచి తెలుసుకొని నిందితులిల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఎనిమిది మందిపై ఐపీసీ సెక్షన్స్ 143, 148, 149, 384, 437, 504, 506 కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
క్రికెటర్ పృథ్వీ షాపై దాడి
February 16, 2023
0
Tags