నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ పై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రశంసల జల్లు కురిపించారు. మహారాష్ట్రపై పవార్ కు ఉన్న ప్రేమ కానీ, సహకార రంగానికి ఆయన అందించిన కృషిని కానీ ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు. అంతే కాకుండా మహారాష్ట్రలోని అతిపెద్ద నాయకుల్లో పవార్ ఒకరని, ఆయన ప్రాముఖ్యతను తగ్గించలేమన్నారు. శివసేన నుంచి విడిపోయి, బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన షిండే, అదే శివసేన (ఉద్ధవ్ వర్గం)తో పొత్తులో ఉన్న పవార్ మీద ఈ స్థాయిలో ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశమైంది. ''పవార్ కు జాతీయ స్థాయిలో చాలా అనుభవం ఉంది. సహకార రంగంలో ఆయన చేసిన కృషిని మర్చిపోలేం. రాష్ట్ర ప్రజల అభివృద్ధికి ఆయన ఆరాటపడుతూ ఉంటారు. ఎవరు అధికారంలో ఉన్నా కూడా వారికి తగిన సూచనలు చేస్తుంటారు. నాకు కూడా అప్పుడప్పుడు కాల్ చేసి సలహాలు ఇస్తుంటారు'' అని షిండే అన్నారు. అలాగే కొద్ది రోజుల క్రితం పవార్ తో తాను సమావేశమైన సంగతి నిజమేనని షిండే అంగీకరించారు. సీనియర్ నాయకుడిని కలిసి సలహాలు తీసుకోవడం అవసరమని ఆయన అన్నారు.
శరద్ పవార్ పై షిండే ప్రశంసలు !
January 21, 2023
0
Tags