తెలంగాణలోని భువనగిరికి చేరుకున్న కేంద్రమంత్రి మన్సుఖ్భాయ మాండవీయను స్థానిక కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలుసుకున్నారు ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం కేంద్రమంత్రితో కలిసి బీబీనగర్కు బయలుదేరి వెళ్లారు. ఇద్దరూ కలిసి- బీబీనగర్ ఎయిమ్స్లో కలియ తిరిగారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ ఫిరాయించే అవకాశాలు ఉన్నాయంటూ కొంతకాలంగా వార్తలు వస్తోన్న నేపథ్యంలో- ఆయనే స్వయంగా కేంద్రమంత్రి మన్సుఖ్ను స్వాగతం పలకడం ప్రాధాన్యతను సంతరించుకుంది. స్థానిక లోక్సభ సభ్యుడి హోదాలో కలిశారని చెబుతున్నప్పటికీ అలాంటి సందర్భం ఇదివరకెప్పుడూ చోటు చేసుకోలేదు. వెంకటరెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే బీజేపీలో చేరారు. దేశ రాజధానిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోనూ ఆయన భేటీ అయ్యారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రధాని అప్పాయింట్ మెంట్ కోరినట్లు వార్తలొచ్చాయి అప్పట్లో. జాతీయ రహదారుల విస్తరణపైన జాతీయ సంస్థలను జిల్లాకు కేటాయించడం వంటి అంశాలపై చర్చించారని తెలిసింది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ముందు నుంచీ వ్యతిరేకిస్తూ వస్తోన్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమౌతోంది.
కేంద్రమంత్రితో కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ !
December 18, 2022
0
Tags