పశ్చిమ బెంగాల్లోని పూర్బ మేదినిపూర్ జిల్లాలో టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ప్రసంగించాల్సి ఉన్న బహిరంగ సభకు సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. సభా స్థలికి 1.5 కిలోమీటర్ల దూరంలోని భూపతి నగర్ ప్రాతంంలో శుక్రవారం మధ్యాహ్నం 11.15 గంటల ప్రాంతంలో పేలుడు జరిగింది. ఘటనా స్థలి నుంచి రెడు మృతదేహాలను శనివారం ఉదయం వెలికితీశామని అధికారులు తెలిపారు. ఈ పేలుడుకు కారణంపై విచారణ జరుపుతున్నామని, శక్తివంతమైన బాంబు పేలడంతో ఒక మట్టి ఇల్లు పైకప్పుతో సహా కుప్పకూలిందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఫోరెన్సిక్ నిపుణులు కూడా ఘటనా స్థలికి చేరుకున్నారు. ఈ ఘటనకు టీఎంసీనే కారణమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీఫ్ ఘోష్ ఆరోపించారు. రాష్ట్రం బాంబుల తయారీ పరిశ్రమగా తయారయిందని అన్నారు. ఈ తరహా ఘటనలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని సీపీఎం నేత సుజన్ చక్రవర్తి ప్రశ్నించారు. దీనిపై సీఎం ఒక ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, విపక్షాల ఆరోపణలను టీఎంసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కునల్ ఘోష్ తోసిపుచ్చారు. సాక్ష్యాలు లేకుండా అధికార పార్టీని నిందించడం ప్రతిపక్షాలకు అలవాటుగా మారిందన్నారు.
బెంగాల్లో భారీ పేలుడులో ఇద్దరు మృతి
December 03, 2022
0
Tags