ప్రారంభానికి ముందే కుప్పకూలిన వంతెన

Telugu Lo Computer
0


బీహార్‌లోని బెగుసరాయ్‌లో గండక్ నదిపై నిర్మించిన 206 మీటర్ల పొడవైన వంతెన ఆదివారంనాడు కుప్పకూలింది. బ్రిడ్జి ముందు బాగం కూలి నదిలో పడటం, ప్రారంభోత్సవానికి ముందే బ్రిడ్జి కుప్పకూలడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. గోవింద్‌పూర్‌, రాజౌరా వెళ్లే సాహెబ్‌పుర్‌ కమల్‌ బ్లాక్‌లోని బుఢీ గండక్‌ నదిపై నిర్మించిన బిష్ణుపుర్‌ అహోక్‌ ఘాట్‌ వంతెనను నావార్డ్ యోజన కింద 2017 సంవత్సరంలోనే పూర్తి చేశారు. ఈ వంతెన నిర్మాణాన్ని మా భగవతి నిర్మాణ సంస్థ చేపట్టింది. దీని నిర్మాణానికి రూ.13.43 కోట్లు ఖర్చు చేశారు. కానీ అప్రోచ్ రోడ్డు లేకపోవడం వల్ల ఈ వంతెన ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. కొద్దిరోజుల క్రితమే బ్రిడ్జి ముందు భాగంలో పగుళ్లను గుర్తించారు. డిసెంబర్ 15న ఈ విషయంపై అధికారులకు లేఖ రాయడం జరిగింది. అయితే ఈలోపే బ్రిడ్జి ముందు భాగం కుప్పకూలింది. ఈ వంతెన కూలిపోయిన సమాచారం అందుకున్న వెంటనే ఎస్‌డీఓ రోహిత్‌కుమార్‌, ఎస్‌డీపీవో కుమార్‌ వీరేంద్ర, పలువురు అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఆ వంతెనపై వాహనాల రాకపోకలు లేనందున పెద్ద ప్రమాదం తప్పిపోయిందని స్థానికులు అంటున్నారు. అయితే, వంతెన నిర్మించిన కాంట్రాక్టర్ను వెంటనే అరెస్టు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ వంతెన నిర్మాణంలో భారీ దోపిడీలు జరిగాయని, ప్రారంభానికి ముందే నదిలో మునిగిపోవటమే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యమని లోక్ జనశక్తి పార్టీ ప్రధాన నాయకుడు అన్నారు. వంతెనను నిర్మించిన ఏజెన్సీ కాంట్రాక్టర్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)