రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్, బీజేపీ సభ్యుల మధ్య వాగ్వాదం జరగడాన్ని ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ తీవ్రంగా తప్పుబట్టారు. ఒకరి మాట వినే ఓపిక మరొకరికి ఉండటం లేదని, మనల్ని చూసి 135 కోట్ల మంది ప్రజలు నవ్వుకుంటున్నారని మండిపడ్డారు. సభ సంప్రదాయాలను పాటించాలని, సభకు ఉన్న గౌరవాన్ని కాపాడాలని సభ్యులందరినీ కోరారు. రాజస్థాన్లోని ఆల్వార్లో భారత్ జోడో యాత్రలో భాగంగా జరిగిన ర్యాలీలో మల్లికార్జున ఖర్గే సోమవారం మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం తేవడం కోసం కాంగ్రెస్ ఎన్నో త్యాగాలు చేసిందని, బీజేపీ కనీసం ఓ శునకాన్ని అయినా పోగొట్టుకోలేదని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై రాజ్యసభలో బీజేపీ సభ్యులు మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖర్గే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కానీ కాంగ్రెస్ అందుకు ససేమిరా అంది. సభ ప్రారంభ సమయంలో ఈ విధంగా ఇరు పక్షాలు వాగ్వాదానికి దిగడంతో గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలో జగదీప్ ధన్కర్ మాట్లాడుతూ తీవ్ర నైరాశ్యం, అసంతృప్తి వ్యక్తం చేశారు. సభా మర్యాదలను పాటించాలని బీజేపీ, కాంగ్రెస్ సభ్యులను కోరారు. అభిప్రాయాలను తెలియజేయడానికి ఇరు పక్షాలకు ఈ సభ ఓ గొప్ప వేదిక అని తెలిపారు. బయట జరిగే ప్రతి విషయాన్నీ ఈ సభ గుర్తించాలని, ప్రతిబింబించాలని తెలిపారు. ఈ సభలో మాట్లాడే ప్రతి మాటకు గొప్ప విలువ ఉంటుందన్నారు. ఏ విషయాన్ని ప్రస్తావించాలన్నా ప్రతి ఒక్కరూ నిబంధనలను పాటించాలన్నారు. ఖర్గే క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్న బీజేపీ సభ్యులను మందలించారు. ఇది చెడు దృష్టాంతంగా నిలుస్తుందన్నారు. ఇటువంటి ప్రవర్తన పార్లమెంటుకు చెడ్డ పేరు తెస్తుందన్నారు. అందరినీ ఉద్దేశించి చైర్మన్ చేసే వ్యాఖ్యలను సైతం జీర్ణించుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత బాధాకరమైన పరిస్థితిలో మనం ఉన్నాం? అని వాపోయారు. 'నన్ను నమ్మండి... మనల్ని చూసి 135 కోట్ల మంది నవ్వుకుంటున్నారు. వారు ఆవేదన చెందుతున్నారు, మనం ఒకరి మాటను మరొకరం వినలేమని భావిస్తున్నారు'' అని అన్నారు. సభలో పరిస్థితి కాస్త సద్దుమణగడంతో రాజ్యసభ నేత, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను పిలిచి, సంబంధిత అంశాలను లేవనెత్తాలని, ఎంపీలను ఉద్దేశించి మాట్లాడాలని కోరారు.పీయూష్ గోయల్ మాట్లాడుతూ, ఖర్గే అభ్యంతరకరమైన భాషను ప్రయోగించారన్నారు. ఖర్గే చేసిన వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని, ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన ఉపయోగించిన భాష ఆయన ఆలోచనలను, అసూయను ప్రతిబింబిస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆమోదించలేదని ఆయనకు అసూయగా ఉండి ఉండవచ్చునన్నారు. అటువంటి అభ్యంతరకరమైన భాషను మాట్లాడటం ఈ సభకు అవమానకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఖర్గే స్పందిస్తూ, పార్లమెంటు వెలుపల చేసిన వ్యాఖ్యలపై సభలో చర్చించరాదన్నారు. క్షమాపణ చెప్పేందుకు తిరస్కరించారు.
ఎంత బాధాకరమైన పరిస్థితుల్లో ఉన్నాం ?
December 20, 2022
0
Tags