మహారాష్ట్రలోని బీజేపీ సంకీర్ణ సర్కారుపై ఆ రాష్ట్ర నాయకురాలు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుప్రియా సూలే తీవ్ర విమర్శలు గుప్పించారు. పరిపాలనలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలమైందని ఆరోపించారు. అంతర్రాష్ట్ర సరిహద్దు సమస్యలతోపాటు ఏ సమస్యను ప్రభుత్వం పరిష్కరించలేక పోతున్నదని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని సరిగా పరిపాలించడం చేతగాకపోయినా బీజేపీ నేతలు తరచూ మహానీయులను అవమానించే వ్యాఖ్యలు చేస్తున్నారని సుప్రియ ఆవేదన వ్యక్తంచేశారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ గురించి, బాబా సాహెబ్ అంబేద్కర్ గురించి అవమానకరంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలపై కేంద్రం ప్రభుత్వంగానీ, రాష్ట్రం ప్రభుత్వంగానీ, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్గానీ ఇంతవరకు క్షమాపణ చెప్పకపోవడం దారుణమని ఆమె దుయ్యబట్టారు. ఇప్పటి బీజేపీ నేతలు మునుపటి బీజేపీ నేతలు కాదని సుప్రియా సూలే వ్యాఖ్యానించారు. అరుణ్జైట్లీ, సుష్మాస్వరాజ్ లాంటి బీజేపీ నేతల ప్రసంగాల నుంచి తాను ఎన్నో నేర్చుకున్నానని, కానీ ఇప్పటి బీజేపీ నేతలు మాట్లాడుతున్నారంటేనే ఏ మాట్లాడుతారోనన్న భయం కలుగుతున్నదని చెప్పారు.
పాలనలో మహారాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది !
December 17, 2022
0
Tags