జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ తనకు సమన్లు పంపడం ఒక గిరిజన ముఖ్యమంత్రిని వేధించే కుట్రలో భాగమని అన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన జార్ఖండ్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ కేంద్ర బలగాలను ప్రయోగించిందని ఆయన విమర్శించారు. ఈడీ, సీబీఐలకు తాను భయపడనని, తమను వ్యతిరేకించే ఎవరి గొంతునైనా అణిచివేసేందుకు రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేయడమే అన్నారు. నేను దోషినే అయితే నన్నెందుకు ప్రశ్నిస్తున్నారు? మీకు వీలైతే వచ్చి నన్ను అరెస్టు చేయండి అని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అన్నారు. మైనింగ్ కుంభకోణంలో లాండరింగ్ చేశాడని ఈడీ ఆరోపించిన సంగతి తెలిసిందే. రాంచీలోని ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో ఈరోజు విచారణకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ వెళ్లకుండా జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ కార్యకర్తలతో సమావేశం కావడం గమనార్హం. బొగ్గు మైనింగ్ కుంభకోణం కేసులో ఇప్పటికే ఆయన సన్నిహితుడు పంకజ్ మిశ్రా సహా మరో ఇద్దరిని ఇప్పటికే అరెస్ట్ చేసింది ఈడీ. జులైలో దాడులు నిర్వహించి మిశ్రా బ్యాంకు ఖాతాల్లోని రూ.11.88 కోట్లు సీజ్ చేసింది. అలాగే ఆయన ఇంట్లో రూ.5.34 కోట్ల అక్రమ నగదు లభించినట్లు వెల్లడించింది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రతీకార చర్యలతో బిజీగా ఉంటూ పారిపోయిన వ్యాపారులను వదిలివేసిందని ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆరోపించారు.
ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ కుట్ర !
November 03, 2022
0
Tags