ఉమ్మడి పౌరస్మృతికి కట్టుబడి ఉన్నాం !

Telugu Lo Computer
0


ఉమ్మడి పౌరస్మృతి అమలుకు బీజేపీ కట్టుబడి ఉందని ఆ పార్టీ అగ్ర నేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. అయితే ప్రజాస్వామిక ప్రక్రియలో, అందరితో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. గురువారం ఓ చానల్‌ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారతీయ జన్‌సంఘ్‌ కాలం నుంచీ ఉమ్మడి పౌరస్మృతి అమలు తమ డిమాండ్‌ అని గుర్తుచేశారు. రాజ్యాంగ సభ కూడా ఏదో ఒక సమయంలో దీనిని అమలు చేయాలని పార్లమెంటు, అసెంబ్లీలకు సిఫారసు చేసిందని ఆ విషయాన్ని విస్మరించారని ఆక్షేపించారు. బీజేపీ తప్ప ఏ పార్టీ కూడా పౌరస్మృతికి అనుకూలంగా లేదన్నారు. దీనిపై ప్రజాస్వామికంగా ఆరోగ్యకరమైన చర్చ జరగాలని ఆకాంక్షించారు. ఉమ్మడి పౌరస్మృతిపై హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తుల సారథ్యంలో కమిటీలు వేశారని, అన్ని వర్గాలూ తమ అభిప్రాయాలను వాటికి తెలియజేస్తున్నాయని తెలిపారు. లౌకికవాద దేశంలో చట్టాలు మతప్రాతిపదికన ఉండరాదని అభిప్రాయపడ్డారు. కులవాదం, వారసత్వం, బుజ్జగింపు విధానాల నుంచి ప్రధాని మోదీ దేశ రాజకీయాలను విముక్తి చేశారని కొనియాడారు. పనితీరు ఆధారిత రాజకీయాలను ప్రారంభించారని, ఎవరు బాగా పనిచేస్తే వారే దేశాన్ని పాలిస్తారని తెలిపారు. పుట్టుక, కులం ఆధారంగానో, ఒకానొక వర్గాన్ని బుజ్జగించడం ద్వారానో పాలించలేరని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు సీబీఐ, ఈడీ వంటి సంస్థలను మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్న ఆరోపణలపై అమిత్‌షా తీవ్రంగా స్పందించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా పనిచేస్తున్నాయన్నారు. వాటిపై ఎవరికైనా ఇబ్బందులుంటే కోర్టులను ఆశ్రయించవచ్చని సూచించారు. శ్రద్ధా వాకర్‌ హంతకుడికి కఠిన శిక్ష విధించేందుకు ఢిల్లీ పోలీసులు, ప్రాసిక్యూషన్‌ తగు చర్యలు తీసుకుంటాయన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మతమార్పిడులకు వ్యతిరేకంగా చట్టాలు చేసిందని.. గుజరాత్‌లో కఠినంగా అమలు చేస్తున్నామని తెలిపారు. గుజరాత్‌ ఎన్నికల్లో కాంగ్రె్‌సతోనే తమకు పోటీ అని, సీట్లు, ఓటింగ్‌ శాతంలో గత రికార్డులన్నీ చెరిపేస్తామని ధీమాగా చెప్పారు. హిమాచల్‌, గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో, ఢిల్లీ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)