గురుగ్రామ్లో భోరా కలన్ ప్రాంతంలో మసీదులో నమాజ్ చేస్తున్న వారిపై దాడిచేసి దానిని ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించి పోలీసులు 12 మందిపై కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ ప్రకారం.. ఈ ప్రాంతానికి చెందిన కొందరు దుండగులు స్థానిక మసీదు లోకి ప్రవేశించి ధ్వంసం చేశారు. అక్కడ నమాజ్ చేసుకుంటున్న వారిపై దాడిచేయడమే కాకుండా చంపేస్తామని బెదిరించారు. ఆ తర్వాత మసీదు గేటుకు తాళం వేసి అక్కడి నుంచి పరారైనట్టు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఈ ఘటనపై బిలాస్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సుబేదార్ నజర్ మహమ్మద్ మాట్లాడుతూ.. భోరా కలాన్లో కేవలం నాలుగు ముస్లిం కుటుంబాలు మాత్రమే నివసిస్తున్నట్టు తెలిపారు. బుధవారం తాను, ఇతరులు కలిసి మసీదులో నమాజ్ చేస్తున్న సమయంలో కొందరు దురుసుగా లోపలికి వచ్చి తమపై దాడి చేసినట్టు పేర్కొన్నారు. ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోవాలని తమను బెదిరించారని ఆయన ఆరోపించారు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటి వరకు ముగ్గురు నిందితులు.. రాజేశ్ చౌహాన్, అనిల్ బహదౌరియా, సంజయ్ వ్యాస్లను గుర్తించారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్టు పోలీసులు తెలిపారు.
నమాజ్ చేస్తున్న వారిపై అల్లరిమూక దాడి !
October 13, 2022
0