హిందీ బాషలో వైద్య విద్యను అందించే మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రాజెక్టును కేంద్ర హోం మంత్రి అమిత్షా ఆదివారం ప్రారంభించారు. భోపాల్లోని లాల్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో హిందీ మెడికల్ పాఠ్య పుస్తకాలను ఆవిష్కరించారు. మెడికల్ బయోకెమిస్ట్రీ, అనాటమీ, మెడికల్ ఫిజియోలజీ సబ్జెక్ట్ పాఠ్య పుస్తకాలను ఆవిష్కరించిన ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో అమిత్షా మాట్లాడుతూ, నూతన జాతీయ విద్యా విధానం ద్వారా విద్యార్థుల మాతృ భాషకు ప్రధాని మోదీ ప్రాధాన్యం ఇచ్చారని, ఇదొక చారిత్రక నిర్ణయమని అన్నారు. భారతదేశ విద్యారంగంలో ఇవాళ ఒక ముఖ్యమైన రోజని అభివర్ణించారు. రాబోయే రోజుల్లో చరిత్ర లిఖించేటప్పుడు ఈరోజు స్వర్ణాక్షరాలతో ముద్రితమవుతుందన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ మాట్లాడుతూ, హిందీలో ఎంబీబీఎస్ కోర్సును ప్రారంభించిన తొలి రాష్ట్రం క్రెడిట్ మధ్యప్రదేశ్కే దక్కుతుందని అన్నారు. కాగా, మధ్యప్రదేశ్ పర్యటనలో భాగంగా గ్వాలియర్లో నూతన ఎయిర్పోర్ట్ టెర్మినల్కు అమిత్షా శంకుస్థాపన చేయనున్నారు.
హిందీలో వైద్య విద్య !
October 16, 2022
0
Tags