పంజాబ్ పాటియాలాకు చెందిన 13 ఏళ్ల బాలుడు 8వ తరగతి చదువుతున్నాడు. నిశ్చయ్ మల్హన్ అనే వ్యక్తి నిర్వహిస్తున్న 'ట్రిగ్గర్డ్ ఇన్సాన్' యూట్యూబ్ ఛానల్ అంటే ఎంతో ఇష్టం. ఇతనికి యూట్యూబ్లో కోటిన్నరకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. బాలుడు కూడా అతన్ని ఫాలో అవుతున్నాడు. అయితే ఆ ఛానల్ నిర్వాహకుడు నిష్చాయ్ మల్హాన్ను కలవాలని బాలుడు నిర్ణయించుకున్నాడు. మల్హాన్ ఢిల్లీలోని పితంపుర ప్రాంతంలో నివసిస్తున్నట్లు తెలుసుకున్న విద్యార్థి తన సైకిల్పై అక్టోబర్ 4న ఢిల్లీకి పయనమయ్యాడు. మూడు రోజులు 250 కిలోమీటర్లు సైకిల్పై ప్రయాణించి పితంపుర అపార్ట్మెంట్స్కు చేరుకున్నాడు. అయితే మల్హాన్ అక్కడ లేడని, దుబాయ్ వెళ్లినట్లు చెప్పడంతో అతను తీవ్ర నిరాశ చెందాడు. మరోవైపు కొడుకు కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందిన అతని తల్లిదండ్రులు పటియాలా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో పలు ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటీజీలో బాలుడు ఢిల్లీ వెళ్లినట్లు కనిపించాడు. దీంతో ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించారు. అంతేగాక సోషల్ మీడియాను ఉపయోగించి బాలుడి గురించి ప్రచారం చేశారు. చివరికి యూట్యూబర్ అపార్ట్మెంట్ వద్ద ఉన్న సీసీటీవీ పరిశీలించగా పోలీసులు బాలుడి సైకిల్ను గుర్తించారు, అనంతరం అతని ఇంటికి దగ్గరలో ఉన్న పార్క్ వద్ద బాలుడిని కనుగొన్నారు. దీంతో పోలీసులు బాలుడి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు అతన్ని ఇంటికి తీసుకెళ్లారు. అయితే అతడు రాత్రిళ్లు ఎక్కడ బస చేశాడో ఎక్కడ విశ్రాంతి తీసుకున్నాడో స్పష్టత రాలేదు. ఇదిలా ఉండగా బాలుడు విషయం యూట్యూబ్ స్టార్ వరకు చేరింది. ముందుగా విద్యార్థి కనిపించకుండా పోయాడని తెలిసి ఆందోళన చెందిన మల్హాన్, అతన్ని వెతికి పట్టుకోవాలని పోలీసులను కోరాడు. అనంతరం విద్యార్థి దొరికిన సంగతి తెలిసి..'హమ్మయ్యా ఎట్టకేలకు బాలుడు తన ఇంటికి చేరాడు. మంచి విషయం' అంటూ ట్వీట్ చేశాడు.
యూట్యూబర్ ను కలిసేందుకు సైకిల్పై 250 కి.మీ ప్రయాణించిన బాలుడు !
October 08, 2022
0
Tags