ఢిల్లీ లిక్కర్ స్కాంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి ?

Telugu Lo Computer
0


వచ్చే నవంబర్ నుంచి ఢిల్లీలో కొత్త మద్యం పాలసీ తీసుకొస్తున్నారు. లిక్కర్ అమ్మకాల బాధ్యత నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పుకుంది. మద్యం మాఫియాకు చెక్ పెట్టడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం పెంచడానికే కొత్త పాలసీ తీసుకొచ్చామని కేజ్రీవాల్ సర్కార్ ప్రకటించింది. ప్రభుత్వం తప్పుకోవడంతో ప్రైవేటు మద్యం వ్యాపారులు కస్టమర్లకు ఆఫర్లు పెట్టారు. వన్ ప్లస్ వన్ ఆఫర్ కూడా పెట్టారు. కొందరు వ్యాపారులు ఎంఆర్పీ రేట్ల కంటే తక్కువకే విక్రయించారు.దీంతో ఢిల్లీలో లిక్కర్ సేల్స్ భారీగా పెరిగాయి. ఆప్ సర్కార్ కు అంచనాకంటే ఎక్కువ రాబడి వస్తోంది. అయితే కొత్త మద్యం పాలసీ ఎక్సైజ్ టెండర్లలో అక్రమాలు జరిగాయని బీజేపీ ఆరోపిస్తోంది. బ్లాక్ లిస్టులో పెట్టిన కంపెనీలకు కట్టబెట్టారని.. అసలు బ్లాక్ లిస్టులో ఉన్న కంపెనీలను టెండర్ ప్రక్రియలో ఎలా అనుమతించారని నిలదీస్తోంది. బీజేపీ ఆరోపిస్తున్న వివాదాస్పద మద్యం కంపెనీలో ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డికి చెందిన సంస్థ ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. నిషేదిత జాబితాలో ఉన్న ఖావో గాలి అనే సంస్థ వైసీపీ ఎంపీ మాగుంటకు చెందిన కంపెనీతో కలసి సిండికేటుగా ఏర్పడిందని ఢిల్లీ బీజేపీ నేతలు చెబుతున్నారు. కేజ్రీవాల్ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో కొన్ని లిక్కర్ సంస్థలకు లాభం కలిగిందని కమలనాధులు ఆరోపిస్తున్నారు. బ్లాక్ లిస్టులో ఒక్క కంపెనీ టెండర్లలో పాల్గొనడమే తప్పు అయితే, ఆ సంస్థ మరో కంపెనీతో సిండికేట్ కావడం ఏంటని బీజేపీ నేతలు నిలదీస్తున్నారు. ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయని, ప్రభుత్వ పెద్దలకు వాటాలు వచ్చాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమ దందాలో 144 కోట్ల రూపాయలు కేజ్రీవాల్ ప్రభుత్వంలోని పెద్దలకు అందాయంటూ బీజేపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. అంతేకాదు మద్యం లైసెన్సు కోసం డిపాజిట్ చేసిన 30 కోట్ల రూపాయలను కేబినెట్ ఆమోదం లేకుండా బిడ్డర్ కు తిరిగి ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. మద్యం పాలసీ టెండర్లపై బీజేపీ చేస్తున్న ఆరోపణలతో కేజ్రీవాల్ సర్కార్ దిద్దుబాటు చర్యలకు దిగింది. మద్యం విధానాన్ని రద్దు చేసింది. ఆగస్టు 1 నుంచి పాత పద్దతిలోనే ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం అమ్మకాలు ఉంటాయని ప్రకటించింది.మద్యం పాలసీ స్కాంపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని ఆదేశాలు ఇచ్చారు. మద్యం పాలసీ, టెండర్లపై నివేదికను తనకు సమర్పించాలని ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సక్సేనా ఆదేశించారు. మరోవైపు ఢిల్లీ బీజేపీ నేతలు తమ సంస్థపై చేస్తున్న ఆరోపణలను వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఖండించారు. పారదర్శకంగానే తమ కంపెనీ టెండర్ వేసిందని, ఎలాంటి అక్రమాలు జరగలేదని చెప్పారు. తన మద్యం కంపెనీపై ఆరోపణలు చేసిన బీజేపీ నేత మీనాక్షి లేఖికి ఇందుకు సంబంధించి వివరణ కూడా ఇచ్చానని మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)