గురువారం నుంచి జరగబోయే కామన్వెల్త్ గేమ్స్లో భారత్కు కచ్చితంగా పతకం అందిస్తాడని భావించిన భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా ఈ గేమ్స్కు దూరం కానున్నాడు. గాయం కారణంగా వైద్యులు నెల రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో నీరజ్ ఈ గేమ్స్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కామన్వెల్త్ గేమ్స్ గురువారం నుంచి బర్మింగ్హామ్లో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో నీరజ్ చోప్రా వరుస విజయాలతో ఆకట్టుకుంటున్నాడు. గత ఒలంపిక్స్ సందర్భంగా భారత్కు బంగారు పతకం అందించిన నీరజ్ చోప్రా.. ఆదివారం జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో పురుషుల జావెలిన్ థ్రో విభాగంలో సిల్వర్ మెడల్ కూడా సాధించాడు. దీంతో మంచి ఫామ్లో ఉన్న నీరజ్ ఈసారి కామన్వెల్త్ గేమ్స్లో పతకం సాధించడం ఖాయమని అందరూ భావించారు. 2018లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో కూడా నీరజ్ గోల్డ్ మెడల్ సాధించాడు. తాజాగా వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో మెడల్ గెలిచిన తర్వాత తనకు తొడల దగ్గర గాయం అయినట్లు చెప్పాడు. ఈ గాయాన్ని వైద్యులు పరిశీలించిన తర్వాతే తాను కామన్వెల్త్ గేమ్స్లో పాల్గొనేది.. లేనిది తెలుస్తుందన్నాడు. తాజాగా అతడిని వైద్యులు పరీక్షించారు. ఎమ్ఆర్ఐ స్కాన్ చేసిన వైద్యులు నెల రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. మరోవైపు ఈ అంశంపై ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ కూడా స్పందించింది. గాయం నుంచి నీరజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.
నీరజ్ చోప్రాకు గాయం
July 26, 2022
0
Tags