పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కడుపునొప్పితో ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో చేరారు. బుధవారం తెల్లవారుజామున ఆసుపత్రిలో చేరిన ఆయనకు వైద్యులు పలు టెస్టులు నిర్వహించారు. మంగళవారం రాత్రి నుంచే ఆయన కడుపునొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ ఆసుపత్రిలో ఆయన చేరికను పంజాబ్ ప్రభుత్వ వర్గాలు రహస్యంగా ఉంచాయి. పూర్తి సెక్యూరిటీ లేకుండానే భగవంత్ మాన్ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. సీఎం భగవంత్ మాన్ ఇటీవల సుల్తాన్పూర్ లోధిలో పర్యటించారు. ఈ సందర్భంగా కాళీ బెన్ నది ప్రక్షాళన 22వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఆ సమయంలో కాళీ బెన్ నది నుంచి స్వయంగా గ్లాసు నీళ్లు తీసుకుని తాగారు. అనంతరం నది ఒడ్డున మొక్కలు నాటారు. కాళీ బెన్ నదిలో నీటిని తాగడం వల్లే భగవంత్ మాన్ అనారోగ్యం పాలయ్యారనే ప్రచారం జరుగుతోంది. కాలుష్య కోరల్లో చిక్కుకుపోయిన ఆ నది నీళ్లు తాగడం వల్లే ఆయనకు కడుపునొప్పి వచ్చినట్లు చెబుతున్నారు. భగవంత్ మాన్ త్వరగా కోలుకోవాలని ఆప్ నేతలు ఆకాంక్షిస్తున్నారు.
భగవంత్ మాన్ కు అనారోగ్యం !
July 21, 2022
0
Tags