తెలంగాణ-మహారాష్ట్ర మధ్య రాకపోకలు బంద్

Telugu Lo Computer
0


తెలంగాణ-మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిపివేసినట్లు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రకటించారు. గత నాలుగు రోజుల నుండి ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆయా శాఖల అధికారులు, సిబ్బంది అందరూ తమ తమ కార్య స్థానాల్లోనే అందుబాటులో ఉంటూ ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. బుధవారం రాత్రి నిజామాబాద్ కలెక్టరేట్లోని ప్రగతిభవన్లో ఆయన కలెక్టర్ సి నారాయణ రెడ్డి, పోలీస్ కమిషనర్ కె ఆర్ నాగరాజు లతో కలిసి జిల్లాలో భారీ వర్షాల వల్ల నెలకొని ఉన్న పరిస్థితుల గురించి అధికారులతో సమీక్షించారు. వర్షాల వల్ల వాటిల్లిన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం గురించి కలెక్టర్ నారాయణరెడ్డి మంత్రి దృష్టికి తెచ్చారు. భారీ వర్షాల నేపథ్యంలో ఆయా కారణాల వల్ల జిల్లాలో ఇప్పటివరకు నలుగురు మృతి చెందారని, కొన్ని పశువులు కూడా మృత్యువాత పడ్డాయని తెలిపారు. 9 చెరువులకు గండ్లు పడగా, వాటిలో పడకల్ పెద్ద చెరువు వల్ల ఎక్కువగా నష్టం వాటిల్లిందన్నారు. 42 ప్రాంతాల్లో రోడ్లపై నుండి వర్షపు జలాలు ప్రవహిస్తుండడం వల్ల రాకపోకలను నిషేధిస్తూ ట్రాఫిక్ దారి మళ్ళించామని మంత్రికి వివరించారు. నాలుగు చోట్ల రోడ్లు తెగిపోవడంతో సంబంధిత గ్రామాలకు ప్రత్యామ్నాయ మార్గాల్లో రాకపోకలు జరుగుతున్నాయని తెలిపారు. వర్షాల తాకిడితో 110 వరకు విద్యుత్ స్తంభాలు పడిపోయాయని, 11 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయన్నారు. అలాగే 417 గృహాలు పాక్షికంగా , 11 గృహాలు పూర్తిగా దెబ్బతిన్నాయని కలెక్టర్ వివరించారు. వర్షాల వల్ల పంటలకు కూడా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తతతో కూడిన చర్యలు సమర్ధవంతంగా చేపడుతోందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకా రెండు మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తమ తమ కార్య స్థానంలోనే ఉంటూ పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎవరైనా కార్య స్థానాల్లో అందుబాటులో లేకపోతే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు సూచించారు. జిల్లాలో ఎక్కడ కూడా ప్రాణ నష్టం సంభవించకుండా అధికారులు, సిబ్బంది అందరూ బాధ్యతాయుతంగా పని చేయాలని హితవు పలికారు. ముఖ్యంగా పురాతన కాలం నాటి ఇండ్లలో ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, భోజన వసతి సదుపాయాలు కల్పించాలని మంత్రి సూచించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)