మరీ ఇంత అన్యాయమా ?

Telugu Lo Computer
0

 

జొమాటో వంటి కంపెనీలు కస్టమర్ల నుంచి ఎంతమేర ఛార్జీలు వసూలు చేస్తున్నాయో లింక్డ్‌ఇన్ యూజర్  రాహుల్ కబ్రా ప్రూఫ్స్‌తో సహా తెలిపారు. ఈ యూజర్ జొమాటోలో చేసిన ఫుడ్ ఆర్డర్, ఆఫ్‌లైన్‌ లో చేసిన ఫుడ్ ఆర్డర్ బిల్లులను పోల్చారు. ఈ రెండింటి మధ్య భారీ ధర వ్యత్యాసం కనిపించింది. దీంతో ఇదే విషయాన్ని లింక్డ్‌ఇన్ వేదికగా పంచుకున్నారు. ఆఫ్‌లైన్‌లో కాకుండా జొమాటో వంటి ఆన్‌లైన్ యాప్స్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేస్తే ఎంత మొత్తంలో ఎక్కువ ఛార్జీలు చెల్లించాల్సి వస్తుందో మీరే చూడండి అని ఆ యూజర్ ఆర్డర్ ఫొటోలు షేర్ చేశారు. ఈ భారీ వ్యత్యాసం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఆఫ్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తే బిల్లు ఎంత పడుతుంది? ఆన్‌లైన్‌లో అదే ఫుడ్‌ను ఆర్డర్ చేస్తే బిల్లు ఎంత పడుతుంది? రెండిటి మధ్య వ్యత్యాసం ఎంత? వంటి వివరాలను రాహుల్ కబ్రా అనే యూజర్ లింక్డ్‌ఇన్ పోస్టు ద్వారా షేర్ చేశారు. ఒకే ఫుడ్‌కు సంబంధించి చేసిన రెండు ఆర్డర్ల ఫొటోలను పంచుకున్నారు. లింక్డ్‌ఇన్ పోస్ట్ ప్రకారం, ఆర్డర్‌లో వెజ్ బ్లాక్ పెప్పర్ సాస్, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్, మష్రూమ్ మోమో ఉన్నాయి. అయితే CGST, SGSTతో సహా ఆఫ్‌లైన్ ఆర్డర్‌ల మొత్తం బిల్లు రూ.512 అయ్యింది. మరోవైపు, జొమాటో బిల్లు రూ.689.90 అయ్యింది. ఇది రూ.75 డిస్కౌంట్ పోనూ అయిన బిల్లు. దీన్నిబట్టి 34.76% అంటే రూ.178 ఎక్కువ జొమాటో వసూలు చేసినట్లు రాహుల్ గమనించారు. "ఇంత వ్యత్యాసం ఉంటే ఎలా? తక్షణమే బిల్లు పెరుగుదలను ప్రభుత్వం నియంత్రించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను. అప్పుడే వాటాదారులందరికీ సమ న్యాయం జరుగుతుంది" అని రాహుల్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. "కస్టమర్ అక్విజిషన్ కాస్ట్‌తో అన్ని స్టార్టప్‌లు కంపెనీలు ఇబ్బంది పడుతున్నాయి. కస్టమర్ లైఫ్‌టైమ్ వాల్యూని పెంపొందించడంలో నిలుపుదల కీలకం. జొమాటో తన ప్రకటనల కారణంగా నా మనస్సులో ఎల్లప్పుడూ అగ్రస్థానంలో ఉంటుంది. అయితే నేను సాధారణ విలువ-ఆధారిత భారతీయ కస్టమర్ కాబట్టి ధర ఎక్కువ ఎక్కడ ఉంది తక్కువ ఎక్కడ ఉందనేది విశ్లేషిస్తాను" అని రాహుల్ తెలిపారు. ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. ఇతర యూజర్లు కూడా తమ విషయంలో స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ కంపెనీలు అధికంగా బిల్లు వేసినట్లు ఈ పోస్టులు పెడుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)