ముంబైలోని అంధేరిలో జరిగిన ఒక కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ బిఎస్ కొషియారి పాల్గొని మాట్లాడుతూ ''మహారాష్ట్ర నుంచి గుజరాతీలు, రాజస్థానీలను పంపించివేస్తే ఇక్కడ సంపద అనేదే ఉండదు. ముఖ్యంగా ముంబై, థానేల్లో డబ్బు ఉండదు. దేశ ఆర్థిక రాజధానిగా ముంబై కొనసాగలేదు'' అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలపై శివసేన సహా పలు పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరాఠీలను, మహారాష్ట్రను కించపరిచేలా వ్యాఖ్యనించారని మండిపడుతున్నారు. దీనిపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు. ''మహారాష్ట్రను, మరాఠీలను, శివాజీని గవర్నర్ అవమానిస్తున్నారు. ఆత్మగౌరవం, మరాఠీ పౌరుషం ఉందని చెప్పే షిండే ఈ మాటలు విన్నారా? ఒక వేళ ఈ మాటలు వింటే వీటిని మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండే ఖండించాలి. గవర్నర్ వ్యాఖ్యలు మరాఠీ ప్రజలకు అవమానం. మరాఠీ ప్రజలు అడుక్కునే వాళ్లా? మరాఠీ వ్యక్తిగా ఏమాత్రం ఆత్మగౌరవం ఉన్నా షిండే.. గవర్నర్ను రాజీనామా చేయమని అడగాలి'' అని సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు. శివసేనతోపాటు కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు కూడా గవర్నర్ వ్యాఖ్యలను ఖండించారు. గవర్నర్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
మహారాష్ట్ర గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు
July 30, 2022
0
Tags