ఉదయ్‌పూర్‌ తరహాలో మహారాష్ట్రలో హత్య.!

Telugu Lo Computer
0


మహారాష్ట్రలోని అమరావతిలో ఉదయ్‌పూర్‌ తరహా హత్య జరిగింది. ప్రవక్తపై నుపుర్‌ శర్మ చేసిన వివాదస్పద వ్యాఖ్యలకు మద్దతుగా సోషల్‌ మీడియాలో పోస్టులు షేర్‌ చేసిన 54 ఏళ్ల వ్యక్తిని కొందరు హత్య చేశారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కన్హయ్య లాల్‌ను తల నరికి చంపిన ఘటనకు వారం ముందు ఇది జరిగింది. అమరావతికి చెందిన కెమిస్ట్‌ ఉమేష్ ప్రహ్లాదరావు కోల్హే స్థానికంగా మెడికల్‌ షాపు నిర్వహిస్తున్నాడు. ప్రవక్తపై నుపుర్‌ శర్మ చేసిన వివాదస్పద వ్యాఖ్యలకు మద్దతుగా పోస్టులను వాట్సాప్‌ గ్రూపుల్లో షేర్‌ చేశాడు. అతడు షేర్‌ చేసిన వాట్సాప్‌గ్రూపుల్లో కస్టమర్లతో పాటు కొందరు ముస్లిం వ్యక్తులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 21న కొందరు దుండగులు ఉమేష్‌ను కత్తితో పొడిచి హత్య చేశారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన కన్హయ్య లాల్‌ తరహా హత్యగా ఇది ఉండటంతో ప్రవక్తపై పోస్ట్‌లు షేర్‌ చేసినందుకు ప్రతీకారంగా చేసిన హత్య కోణంలో దర్యాప్తు జరుపాలంటూ స్థానిక బీజేపీ నేతలు పోలీసులను లేఖ ద్వారా కోరారు. దీంతో ఈ మేరకు కేసు నమోదు చేసి ఆరుగురు వ్యక్తులను అరెస్ట్‌ చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. మరోవైపు మహారాష్ట్రలోని అమరావతిలో జూన్‌ 21న జరిగిన కెమిస్ట్‌ ఉమేష్ ప్రహ్లాదరావు హత్య, ఉదయ్‌పూర్‌ ఘటనను పోలినట్లు ఉండటంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పందించింది. ఈ కేసు దర్యాప్తును ఎన్‌ఐఏకు అప్పగించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా శనివారం ట్వీట్‌ చేశారు. ఈ హత్యల వెనుక కుట్ర, విదేశీ శక్తులతో సంబంధాలు, ఉగ్రవాద కోణంపై ఎన్‌ఐఏ లోతుగా దర్యాప్తు చేస్తుందని అందులో పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)