ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలోగల ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీ విశ్వనాథ ఆలయ గర్భగుడిలో భక్తులకు, ఆలయ సిబ్బందికి మధ్య గొడవ జరిగింది. ఇరువర్గాలు ఒకరినొకరు తోసుకున్నాయి. ఈ ఘటన ఈ ఘటన శనివారం సాయంత్రం జరిగింది. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజీ సోషల్ మీడియాలో ఆదివారం వైరల్ అవుతోంది. ఆలయ గర్భగుడి వద్ద హారతి కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు తోపులాట జరిగింది. వైరల్ అవుతున్న వీడియోలో ఆలయ సిబ్బంది, భక్తులు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం కనిపించింది. కాశీ విశ్వనాథ ఆలయంలో శనివారం సాయంత్రం హారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సమయంలో గర్భగుడి తలుపులు మూసివేశారు. అయితే, కొంతమంది భక్తులు దర్శనం కోసం పట్టుబట్టారు. వారిని ఆలయ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో భక్తులు, సిబ్బంది మధ్య వాగ్వాదం జరిగింది. ఇదికాస్తా గొడవకు దారితీసింది. సిబ్బంది, భక్తులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు, చెంపదెబ్బలతో రెచ్చిపోయారు. చివరికి భక్తులను బలవంతంగా గర్భగుడి నుంచి బయటకు తీసుకొచ్చారు. అనంతరం ఈ ఘటనపై సిబ్బంది ఆలయ నిర్వాహకులకు లేఖ రాశారు. పోలీసులు కూడా సహకరించడం లేదని ఆరోపించారు. మరోవైపు తమపై దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ నలుగురు ఆలయ సిబ్బందితో సహా ఐదుగురిపై ఇద్దరు భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాశీ విశ్వనాథ ఆలయంలో భక్తులు, సిబ్బంది గొడవ
July 24, 2022
0