ప్రధానమంత్రి నరేంద్రమోదీ తల్లి హీరాబెన్ నేడు శతవసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా మాతృమూర్తిని కలిసిన మోదీ.. ఆమె కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ ఉదయం 6.30 గంటల ప్రాంతంలో గాంధీనగర్లోని తన తమ్ముడు పంకజ్ మోదీ నివాసానికి వెళ్లిన ప్రధాని తల్లిని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకున్నారు. దాదాపు అరగంట పాటు మోదీ తన తల్లితో ముచ్చటించి అక్కడి నుంచి తిరుగుపయనమయ్యారు. తన తల్లి శతవసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రధాని మోదీ ప్రత్యేక బ్లాగ్ రాసుకొచ్చారు. తన జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడం కోసం అమ్మ చేసిన త్యాగాలను గుర్తుచేసుకున్నారు. అమ్మ అంటే.. కేవలం పదం మాత్రమే కాదని, భావోద్వేగాల సమాహారమని అన్నారు. ప్రతి తల్లిలాగే తన మాతృమూర్తి కూడా ఎంతో సాధారణంగా కన్పించే అద్భుతమైన వ్యక్తి అని కొనియాడారు. ఇన్నేళ్ల ప్రజా జీవితంలో కేవలం రెండే రెండు సార్లు తన తల్లి తనతో పాటు బహిరంగ సభలో కన్పించారని తెలిపారు. ఏక్తా యాత్ర తర్వాత శ్రీనగర్లోని లాల్చౌక్ వద్ద జాతీయ జెండా ఎగురవేసి గుజరాత్కు తిరిగి వచ్చిన తర్వాత తన తల్లి బహిరంగ సభలో పాల్గొని నుదుట తిలకం దిద్ది ఆశీర్వదించారని చెప్పారు. ఆ తర్వాత 2001లో తాను గుజరాత్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసే సమయంలో రెండోసారి బహిరంగ సభలో పాల్గొన్నారని గుర్తుచేసుకున్నారు.
శత వసంతంలోకి హీరాబెన్.
June 18, 2022
0
Tags