వైసీపీ అధిష్టానం కొత్తపల్లి సుబ్బారాయుడు ను పార్టీ నుంచి సాగనంపింది. 'నాకు వ్యక్తిగత చరిష్మ ఉంది. అన్నివర్గాల ప్రజల ఆదరణ నాకు ఉంది. పార్టీలతో సంబంధం లేకుండా అందరూ నన్ను గౌరవిస్తారు. వచ్చే ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందుతా'..నని మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రకటించిన 24 గంటల్లో ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. గత కొంతకాలంగా సుబ్బారాయుడు పార్టీ తీరును ప్రశ్నించడంతో పాటు పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. నరసాపురం జిల్లా కేంద్రం ఏర్పాటుపై ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమబాట పట్టారు. స్థానిక ముదునూరి ప్రసాదరాజును గెలిపించినందుకు తగిన శాస్తి జరిగిందంటూ తన చెప్పుతో తానే కొట్టుకొని నిరసన తెలిపారు. అప్పట్లో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. అప్పటి నుంచి కొత్తపల్లి సుబ్బారాయుడు తీరు మారుతూ వస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాలకు దూరం పాటిస్తూ వస్తున్నారు. దీంతో సుబ్బారాయుడుపై రకరకాల కథనాలు వెలువడ్డాయి. ఆయన తిరిగి తన సొంత గూటికి టీడీపీలో చేరతారన్న ప్రచారం నడిచింది. మరోవైపు జనసేన గూటికి చేరుతారని.. ఇప్పటికే ఆ పార్టీ కీలక నాయకులతో చర్చలు కూడా పూర్తయ్యాయన్న టాక్ నడిచింది. కానీ అవేవీ బయటపెట్టలేదు. తాజాగా వైసీపీ అధిష్టానం ఆయనపై సస్పెన్షన్ వేటు వేయడంతో ఒకటి రెండు రోజుల్లో సుబ్బారాయుడు భవిష్యత్ కార్యాచరణ వెల్లడించే అవకాశం ఉంది.
సుబ్బారాయుడు వైసీపీ నుంచి సస్పెండ్
June 02, 2022
0
Tags