మాదకద్రవ్యాల కేసులో అరెస్టయిన బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ కపూర్ బెయిల్పై విడుదలయ్యాడు. ఆయనతో పాటు అరెస్టయిన మరో నలుగురికి కూడా బెయిల్ మంజూరైనట్లు బెంగళూరు పోలీసులు వెల్లడించారు. పోలీసులు ఎప్పుడు పిలిచినా వారు విచారణకు తప్పకుండా హాజరుకావాలని తూర్పు బెంగళూరు డిప్యూటీ కమిషనర్ భీమాశంకర్ తెలిపారు. మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నారనే ఆరోపణపై సిద్ధాంత్ను ఆదివారం రాత్రి బెంగళూరు పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నగరంలోని ఎంజీ రోడ్డులో గల ఓ ప్రముఖ హోటల్లో రేవ్ పార్టీ జరుగుతోందని, అందులో పాల్గొన్న వారు డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఆ హోటల్పై దాడి చేసి 35 మందిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారికి వైద్య పరీక్షలు చేయించారు. ఇందులో సిద్ధాంత్ కపూర్ సహా ఐదుగురు మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు వెల్లడైందని, దీంతో వారిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే వారు హోటల్లోనే డ్రగ్స్ తీసుకున్నారా ? మాదకద్రవ్యాలు తీసుకున్నాక హోటల్కు వచ్చారా? అనేదానిపై స్పష్టత లేదన్నారు. దానిపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. అయితే సోమవారం సిద్ధాంత్ సహా ఐదుగురిని కోర్టులో హాజరుపర్చగా అర్ధరాత్రి దాటిన తర్వాత వారు బెయిల్పై విడుదలైనట్లు పోలీసులు తెలిపారు. బాలీవుడ్ ప్రముఖ నటుడు శక్తి కపూర్ తనయుడే సిద్ధాంత్ కపూర్. పలు హిందీ సినిమాల్లో సిద్ధాంత్ నటించారు. 'భౌకాల్', 'షూట్ ఔట్ వాడాలా', 'అగ్లీ' వంటి చిత్రాల్లో ఆయన కీలక పాత్రలు పోషించారు. ఆయన సోదరి శ్రద్ధా కపూర్ కూడా బాలీవుడ్లో మంచి గుర్తింపు సాధించింది. దీంతో డ్రగ్స్ కేసులో అరెస్టు కావడం సంచలనం సృష్టించింది. కాగా, సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతికి సంబంధించిన డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా.. 2020లో సిద్ధాంత్ సోదరి శ్రద్ధా కపూర్ను కూడా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) విచారించింది.
శక్తి కపూర్ తనయుడు సిద్ధాంత్కు బెయిల్
June 14, 2022
0
Tags