వాడి పారేసిన ప్లాస్టిక్ ఇచ్చి, నచ్చింది తినండీ, తాగండీ !

Telugu Lo Computer
0


గుజరాత్ ప్రభుత్వం యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ పై వినూత్న నిర్ణయం తీసుకుంది. ఒక్కసారి వినియోగానికి పనికొచ్చే ప్లాస్టిక్ ఉత్పత్తులపై జులై 1 నుంచి నిషేధం అమల్లోకి రానుంది. ఈ సందర్భంగా గుజరాత్ లోని జునాగఢ్ ప్రాంతంలో జూన్ 30న ప్రారంభమవుతున్న ఒక కేఫ్ గురించి చెప్పుకుని తీరాల్సిందే. ఎందుకంటే.. జేబులో డబ్బుల్లేకపోయినా ఈ కేఫ్ లో నచ్చింది తినొచ్చు..తాగొచ్చు. ఏంటీ ఫ్రీ అని అనుకుంటున్నారా? ఫ్రీ అయితే కాదు. కానీ డబ్బులు లేకపోయినా తినొచ్చు. ఎలాగంటే పర్యావరణానికి తూట్లు పొడిచే ప్లాస్టిక్ చెత్తను తీసుకొచ్చి ఇస్తే చాలు. ఆ కేఫ్ లో అందుబాటులో ఉండేవి తినొచ్చు..తాగొచ్చు. ఇంట్లో వాడి పారేసిన ప్లాస్టిక్ చెత్త ఉంటే..వాటిని ఓ సంచిలో వేసుకుని జునాగఢ్ లోని ఈ కేఫ్ కు వెళితే సరి. జిల్లా ప్రభుత్వ యంత్రాంగం వినూత్న ఆలోచనలు ప్రతిరూపం ఈ కేఫ్. దీని వల్ల ప్రజల్లో ప్లాస్టిక్ వ్యర్థాలపై అవగాహన సైతం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ కేఫ్ లోని ఆహార పదార్థాల్లో సహజసిద్ధంగా పండించిన ముడి సరుకులను వినియోగిస్తారు. సర్వోదయ సాక్షి మండల్ ఈ కేఫ్ నిర్వహణను చూడనుంది. పర్యావరణంగా స్వచ్ఛమైన, పరిశుభ్రమైన పట్టణంగా జునాగఢ్ ను తీర్చిదిద్దాలన్నది తమ ప్రయత్నమని అధికారులు చెబుతున్నారు. అర కిలో ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకెళ్లి ఇస్తే గ్లాసు నిమ్మరసం ఇస్తారు. కిలో చెత్తకు ఒక పోహ ఇస్తారు. ఈ రెస్టారెంట్ సమీకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను కొనుగోలు చేసేందుకు అధికారులు ఒక ఏజెన్సీని నియమించుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)