ఈక్వెడార్ సమీపంలోని ఓ ద్వీపంలో ఉంటున్న నిత్యానంద ఆరోగ్యపరిస్థితులపై సామాజిక ప్రసార మాధ్యమాల్లో తరచూ వార్తలు చేస్తున్న విషయం తెలిసిందే. గత రెండు రోజులుగా 'కైలాసా' వెబ్సైట్లో నిత్యానంద విగ్రహాలకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించిన వీడియో దృశ్యాలు, ఫొటోలు వెలువడంతో ఆయన జీవ సమాధి పొందారనే అనుమానాలు బయలుదేరాయి. కైలాస దీవిలో నిర్వహించిన ఈ పూజలు పలు అనుమానాలకు తావిచ్చేవిధంగా ఉన్నాయంటూ ఆయన భక్తులు కలవరపడుతున్నారు. అయితే నిత్యానంద జీవ సమాధి చేయలేదని ఆయన సన్నిహితశిష్యులు చెబుతున్నారు. నిత్యానంద విగ్రహాలకు అభిషేకాలు ఆ దేశంలోనే జరిగాయని, అంత మాత్రానికే ఆయన సమాధి చెందారని పుకార్లు వ్యాపింప చేయడం తగదని పేర్కొన్నారు. నిత్యానంద బ్రతికి ఉన్నారో లేదో స్పష్టంగా తెలియజేయాలంటూ భక్తులు, శిష్యులు సామాజిక ప్రసారమాధ్యమాల్లో డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం రాత్రి నిత్యానంద పేరుతో ఓ ప్రకటన జారీ అయ్యింది. తాను తరచూ నిర్వికల్ప సమాధి స్థితికి చేరుకుంటున్నానని, భక్తులు, శిష్యుల ఆదరాభిమానాలతో తాను 200 యేళ్లపాటు జీవిస్తానని ఆ ప్రకటనలో తెలిపారు. అయితే నిత్యానందకు సంబంధించి తాజా వీడియో దృశ్యాలు ఏవీ విడుదల చేయకపోవడంతో ఆయన భక్తులు ఆందోళన చెందుతున్నారు.
నిత్యానంద జీవ సమాధి ?
June 12, 2022
0
Tags